
సీఎం, డీసీఎంలపై చర్యలేవీ?
హుబ్లీ: సీఎం, డీసీఎంలపై చర్యలు తీసుకోకుండా ఉదాసీనత చూపిన కాంగ్రెస్ హైకమాండ్పై మాజీ సీఎం, బెళగావి ఎంపీ జగదీశ్ శెట్టర్ మండిపడ్డారు. ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. వీరిద్దరిపై చర్యలు తీసుకొనే సత్తా హైకమాండ్కు లేదన్నారు. వారిని మొక్కుబడిగా ఢిల్లీకి పిలిపించి వారిని తిరిగి పంపించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, డీసీఎంలను ఏటీఎంల మాదిరిగా వాడుకుంటోందన్నారు. వీరిద్దరి నుంచి సొమ్ములు వసూలు చేసుకొని పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి 3 గంటలైనా ప్రభుత్వం దృష్టికి తేలేదన్నారు. అధికారులపై సీఎంకు ఎంత మేర అదుపు ఉందో దీనిని బట్టే అర్థమవుతోందన్నారు. మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, లేదో తెలియడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
బస్టాండ్కు వీల్ చైర్ల వితరణ
హొసపేటె: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ విజయనగర జిల్లా శాఖ ద్వారా బస్టాండ్కు వీల్ చైర్లు, ప్రథమ చికిత్స కిట్లు, మాస్క్లను విరాళంగా ఇచ్చారు. బుధవారం బస్టాండ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో రెడ్క్రాస్ సంస్థ చైర్మన్ రవిశంకర్ మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనేక ప్రజా సేవ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా సామాజిక దృక్పథంతో పని చేస్తోందన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్, ఆరోగ్య పరీక్షలు, రక్తదాన శిబిరాలను విజయవంతంగా నిర్వహిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాల ద్వారా సమాజానికి సేవ చేస్తుందని హామీ ఇచ్చారు. బస్టాండ్కు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు వీల్ చైర్లు ఎంతో ఉపయోగపడతాయని రెడ్ క్రాస్ సొసైటీని కళ్యాణ కర్ణాటక ఆర్టీసీ డివిజనల్ కంట్రోలర్ తిమ్మారెడ్డి అభినందించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ ప్రకాష్, రాష్ట్ర శాఖ సభ్యురాలు అన్నపూర్ణ సదాశివ, అబ్దుల్ రెహ్మాన్, యమున, అశ్విని, సిబ్బంది పాల్గొన్నారు.
స్క్యాన్ కోడ్తో
ప్రజా సమస్యలకు చెక్
రాయచూరు రూరల్: స్క్యాన్ కోడ్తో జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం సాధ్యమని ఎస్పీ పుట్టమాదయ్య తెలిపారు. మంగళవారం సదర్ బజార్ పోలీస్ స్టేషన్ కార్యాలయం వద్ద స్క్యాన్ కోడ్ను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా స్క్యాన్ కోడ్ను రూపొందించామన్నారు. కుటుంబ కలహాలు, నాగరికులు, వృద్ధులు, మహిళలు, యువకులు స్క్యాన్ కోడ్లో సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం కల్పించామన్నారు. డీఎస్పీ శాంతవీర, సీఐ ఉమేష్ కాంబ్లే, ఇతర పోలీస్ అధికారులున్నారు.
రోడ్డు ప్రమాదంలో
దంపతుల మృతి
హుబ్లీ: జిల్లాలోని అణ్ణిగేరి సమీపంలోని ఇంగళహళ్లి క్రాస్ రోడ్డు పక్కన నిలిపిన లారీని కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో దంపతులు మరణించిన ఘటన జరిగింది. అణ్ణిగేరి నివాసి జలీల్ అహ్మద్ తన భార్య షబానా బేగం(35)తో కలిసి వ్యక్తిగత పని మీద హుబ్లీ వెళ్లారు. తిరిగి హుబ్లీ నుంచి అణ్ణిగేరికి కారులో వెళుతున్న వేళ ఈ ప్రమాదం జరిగింది. దీంతో నిండు గర్భిణి అయిన షబానా అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన జలీల్ అహ్మద్(40) చికిత్స పొందుతూ కేఎంసీ ఆస్పత్రిలో మృతి చెందాడు. కాగా ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా ఈ వీరిద్దరి మృతదేహాలను ఊళ్లోకి తేవడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ప్రమాదంపై హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
సస్పెన్షన్ను విరమించుకోవాలి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కరవే డిమాండ్ చేసింది. బుధవారం సిరవార తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రాఘవేంద్ర మాట్లాడారు. ఈ నెల 8న బెంగళూరు చిన్నస్వామి క్రీడా మైదానంలో జరిగిన ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో తొక్కిసలాటకు పోలీస్ కమిషనర్ దయానందను బాధ్యుడంటూ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని తప్పుబట్టారు. ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఆదేశాలను ఉపసంహరించుకోవాలంటూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు తహస్లీదార్ ద్వారా వినతిపత్రం సమర్పించారు.

సీఎం, డీసీఎంలపై చర్యలేవీ?

సీఎం, డీసీఎంలపై చర్యలేవీ?