
ఎల్ఎల్సీ గట్టుపై రోడ్డు మరమ్మతులు పూర్తి
హొసపేటె: తాలూకాలోని నాగేనహళ్లి గ్రామంలో భారీ వర్షాల కారణంగా ఎల్ఎల్సీ(పవర్కెనాల్) గట్టు కొట్టుకు పోయిన విషయంపై సాక్షి దినపత్రికలో వార్త వెలువడిన విషయం తెలిసిందే. దీంతో తుంగభద్ర మండలి అధికారులు అప్రమత్తమై రోడ్డు మరమ్మతులను ప్రారంభించి ఎల్ఎల్సీ కాలువ గట్టును మరమ్మతు చేశారు. ప్రస్తుతం ఆ రోడ్డుపై ఉన్న పెద్ద గుంటను తొలగించి ప్రజలు సజావుగా ప్రయాణించడానికి వీలు కల్పించారు.
కారులో మహిళ హత్య ●
● మృతురాలు విజయపుర వాసి
రాయచూరు రూరల్: కారులో విజయపుర నివాసి మహిళను హత్య చేసిన తర్వాత దహనం చేసిన ఘటన కలబుర్గి జిల్లాలో చోటు చేసుకుంది. విజయపుర జిల్లా ిసింధగి తాలూకా గణియార తాండాకు దేవిబాయి లాల్ సింగ్ జాధవ్(42)ను సోమల్ పవార్(53), హము(50) హత్య చేసి కారులో చిత్తాపుర తాలూకా లాడ్లాపుర జాతీయ రహదారి బైపాస్ వద్ద ఆమెను కాల్చి బూడిద చేశారని వాడి పోలీసులు తెలిపారు. పదేళ్ల కిందట దేవిబాయి భర్త మరణించడంతో సోమల్ పవార్తో సహజీవనం చేసి వివాహం చేసుకుంది. అయితే మొదటి భర్త ద్వారా పుట్టిన కుమార్తె పెళ్లి విషయంలో గొడవ పడేవారు. తమ సంబంధీకులకు ఇచ్చి పెళ్లి చేయాలని ఇరువురి మధ్య వాదనలు జరిగేవని తెలిపారు. కూతురిని బస్ ఎక్కించడానికి కారులో సోమల్ పవార్, హము తల్లీకూతుళ్లిద్దరినీ తీసుకెళ్లారు. బస్టాప్లో కూతురిని బస్సు ఎక్కించిన తర్వాత అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లి కలబుర్గి జిల్లాలోకి ప్రవేశించి ఈ కృత్యానికి పాల్పడ్డారని, నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ అడ్డూరి శ్రీనివాసులు తెలిపారు.
చెరువులో పడి ఒకరి మృతి
హుబ్లీ: ధార్వాడ జిల్లా కలఘటిగి తాలూకా గంభ్యాపుర గ్రామం వద్ద నీరసాగర చెరువు సమీపంలో సెల్ఫీ ఫోటో తీసుకోడానికి వెళ్లిన వేళ కాలు జారి చెరువులో పడి ఓ యువకుడు నీటిలో పడి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. హుబ్లీ సోనియాగాంధీ నగర నివాసి అజర్ అహ్మద్(26) మృతుడు. ఈ యువకుడు స్నేహితులతో కలిసి నీరసాగర చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో సెల్ఫీ ఫోటో తీసుకుంటూ కాలు జారి చెరువులో పడిపోయాడు. అజర్ అహ్మద్కు ఈత రాక పోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడని కలఘటిగి ఎస్ఐ కరివీరప్పనవర తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని వెలికి తీసి కేసు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
లారీ ఢీకొని బైక్ చోదకుని మృతి
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని ఉప్పినాయకనహళ్లి సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద లారీ అదుపు తప్పి బైక్ను ఢీకొనడంతో బైక్ చోదకుడు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. పట్టణంలోని రామనగర నివాసి అవినాష్ (25) హొసపేటెలో తన మెడికల్ రెప్ విధులు ముగించుకుని హగరిబొమ్మనహళ్లికి తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో లారీ బలంగా ఢీ కొట్టింది. తీవ్ర రక్తస్రావంతో అవినాష్ అక్కడికక్కడే రక్తపు మడుగులో మృతి చెందాడు. ఈ ఘటనపై హగరిబొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
పరికరాల పంపిణీ
బళ్లారిటౌన్: దివ్యాంగులను, వృద్ధులను గౌరవించి వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని జిల్లా గ్యారెంటీ పథకాల అమలు ప్రాధికార అధ్యక్షుడు కేఈ చిదానందప్ప పేర్కొన్నారు. మంగళవారం జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో దివ్యాంగులకు ఉచిత పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. పుట్టరాజ గవాయి, గురు పంచాక్షరి గవాయి దివ్యాంగుల సంక్షేమానికి పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. సమాజంలో వీరిని ఎప్పుడూ చిన్న చూపు చూడరాదన్నారు. వారికి మన వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ డీడీ విజయ్కుమార్, గాంధీనగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ రవిచంద్ర, అధికారులు గోవిందప్ప, మెహబూబ్, గురురాజ్, ఆదర్శసింగ్, ప్రభురాజు పాల్గొన్నారు.

ఎల్ఎల్సీ గట్టుపై రోడ్డు మరమ్మతులు పూర్తి

ఎల్ఎల్సీ గట్టుపై రోడ్డు మరమ్మతులు పూర్తి