
గాయపడిన మహిళ మృతి
బొమ్మనహాళ్: ఓ ప్రైవేట్ బస్సు, బైక్ని ఢీకొన్న ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న ఓ మహిళ మంగళవారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 5వ తేదీన మండలంలోని ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన దేవరాజు, దేవమ్మ వీరి కుమారుడు నాగేంద్ర (7)లు ద్విచక్ర వాహనంలో బళ్లారి వైపు వెళ్తుండగా (కేఏ–16 బీ–4796) నంబరు గల ఓ ప్రైవేట్ బస్సు బళ్లారి నుంచి కళ్యాణదుర్గానికి వస్తూ నేమకల్లు క్రాస్ వద్ద ఢీకొట్టింది. నాగేంద్రకు కాలు విరిగింది. దేవమ్మ (40) కు తీవ్ర గాయాలు కాగా బళ్లారి విమ్స్కు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించి చనిపోయింది. దేవమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు బళ్లారి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గుండెపోటుతో కార్మికుడు మృతి
హొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకాలోని అరెమాజిగెరె గ్రామంలో మంగళవారం ఉదయం నరేగ పనికి వెళ్తుండగా సాధారణ కార్మికుడు అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలి మరణించాడు. మృతుడిని కార్మికుడు డీ.భరమప్ప(65)గా గుర్తించారు. కే.కల్లహళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అరెమాజిగెరె గ్రామంలో వాగులో ఉపాధి హామీ పథకం కింద మట్టి తొలగింపు పనులు చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. తాలూకా పంచాయతీ ఈఓ చంద్రశేఖర్, గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు నేత్రావతి విరుపాక్షప్ప, నీలగుంద కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అర్పిత, పీడీఓ ఆనంద నాయక్, ఇంజినీర్ హరీష్ సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతుడి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.
కొండచిలువ పట్టివేత
హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె తాలూకా కమలాపుర పట్టణంలోని ఒకటో వార్డు జైభీమ్ నగర్లో సోమవారం రాత్రి కొండ చిలువ కనిపించింది. వర్షం కురిసిన సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో కాని ఒక కొండచిలువ ఇళ్లలోకి ప్రవేశించింది. రాత్రి వేళ కొండ చిలువను చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే వారు సరీసృపాల రక్షకుడు శ్రీనివాస్కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న శ్రీనివాస్ కొండచిలువను ప్రాణాలతో పట్టుకుని సురక్షిత అటవీ ప్రదేశానికి తరలించి వదిలేశాడు.
గాలి లక్ష్మీ అరుణ
పుట్టిన రోజున అన్నదానం
బళ్లారిటౌన్: నగరంలోని జనజాగృతి సంఘం వివిధ ఆటో డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి సతీమణి లక్ష్మీ అరుణ జన్మదినం సందర్భంగా జిల్లా ఆస్పత్రిలో అన్నదానం, గర్భిణులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేపట్టారు. కార్యక్రమానికి నాయకత్వం వహించిన హుండేకర్ రాజేష్ మాట్లాడుతూ లక్ష్మీ అరుణకు అందరి సహకారం, ఆశీస్సులు కావాలని కోరారు. ఈ సందర్భంగా నేతలు స్వామి నాయక్, గాదిలింగ, చంద్ర, దుర్గప్ప, మిథున్, నాగరాజు, రాజు, వీరేష్, బాషా, మాబాష, ఫైజాన్, ఉమర్, వెంకటేష్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులకు
బాలుడి అప్పగింత
హుబ్లీ: తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన మూడేళ్ల బాలుడిని పోలీసులు, ప్రజల సహకారంతో తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. స్థానిక దుర్గదబైలు మార్కెట్కు దావణగెరె నుంచి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన బాలుడు తప్పిపోయాడు. సదరు బాలుడిని గమనించిన స్థానికులు బాలుడిని హుబ్లీ టౌన్ పోలీసులకు అప్పగించారు. తక్షణమే అప్రమత్తమైన ఆ స్టేషన్ సిబ్బంది శంక్రమ్మ, ఏసుదాసు బాలుడి తల్లిదండ్రులను కనుగొని బాలుడిని తిరిగి అప్పచెప్పారు. పోలీసుల చొరవను స్థానికులు అభినందించారు.

గాయపడిన మహిళ మృతి

గాయపడిన మహిళ మృతి