
గ్రామీణ సంస్కృతికి ప్రతిబింబం.. ముంగారు ఉత్సవం
రాయచూరు రూరల్: గ్రామీణ సంస్కృతిని మరిపించే విధంగా ముంగారు ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, నగర శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని ఏపీఎంసీ ఆవరణలో మున్నూరు కాపు సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముంగారు ఉత్సవాల్లో భాగంగా కర్ణాటక ఎద్దులకు నిర్వహించిన ఒకటిన్నర టన్నుల రాతి దూలం లాగే పోటీలను ప్రారంభించి మాట్లాడారు. మాజీ శాసన సభ్యుడు, మున్నూరు కాపు సమాజం అధ్యక్షుడు పాపారెడ్డి ఆధ్వర్యంలో ఏరువాక పున్నమి సందర్భంగా జరిగే పోటీలు ప్రజలకు కనువిందు చేయడం హర్షనీయమన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గద్వాల సంస్థానాధిపతి, జీవీకే అధిపతి కృష్ణ రామ్ భూపాల్ మాట్లాడుతూ మూడు రాష్ట్రాలకు గర్వకారణం ముంగారు మున్నూరు కాపు సంబరాలన్నారు. రైతులకు మొదటి పండుగ ఏరువాక పున్నమి ఖరీఫ్ సీజన్లో రైతులు పొలాలను పదును చేసుకుంటారన్నారు. కాగా ముంగారు ఉత్సవాలపై సాక్షి దినపత్రికలో ప్రచురించిన కథనాల ప్రతులను మంత్రి బోసురాజు, మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో అభినవ రాచోటి శివాచార్య, శాసన సభ్యులు బసన గౌడ, ఎమ్మెల్సీ వసంత కుమార్, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, ఉపాధ్యక్షుడు సమీర్, ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, కాపు నేతలు నరసారెడ్డి, తిమ్మారెడ్డి, శేఖర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, క్రీడా సహాయ కార్యదర్శి పుల్లా రాజేంద్రరెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు.
ఉత్సవాల్లో పాల్గొన్న అతిథుల అభివర్ణన
రాతి దూలం లాగుడు పోటీలు అదుర్స్

గ్రామీణ సంస్కృతికి ప్రతిబింబం.. ముంగారు ఉత్సవం

గ్రామీణ సంస్కృతికి ప్రతిబింబం.. ముంగారు ఉత్సవం