
సీఎం పిలిస్తేనే గవర్నర్ వెళ్లారు
శివాజీనగర/ బనశంకరి: దేశవాప్తంగా భారీ సంచలనం సృష్టించిన బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవంలో చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మరో విషయం బయటపడింది. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆర్సీబీ ఆటగాళ్లను అభినందనకు రాజ్భవన్కు ఆహ్వానించాలని యోచించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విధానసౌధలోనే జరపాలని తెలియజేసినట్లు వెలుగులోకి వచ్చింది. విధానసౌధ కార్యక్రమంలో పాల్గొనేందుకు గవర్నర్ను సీఎం సిద్దరామయ్య అధికారికంగా ఆహ్వానించారని రాజ్భవన్ వర్గాలు ప్రకటించాయి. ఇది సిద్దరామయ్యకు ఇబ్బందిగా మారింది. గవర్నర్ను నేను ఆహ్వానించలేదు, రాష్ట్ర క్రికెట్ సంస్థ పిలిచింది అని సీఎం సిద్దరామయ్య గతంలో తెలిపారు. ప్రధాన కార్యదర్శి నన్ను అడిగిన తరువాత పోలీసులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమోదించారు. నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఆ తరువాత కేఎస్సీఏ కోశాధికారి, కార్యదర్శి తనను పాల్గొనాలని ఆహ్వానించారు అని సిద్దరామయ్య చెప్పారు. ఇందులో నాకేం తెలియదు అని అర్థం వచ్చేలా సీఎం మాట్లాడారు. విధానసౌధ ముందు సంబరాలను జరిపేందుకు ఆదేశించలేదని సీఎం చెప్పుకొన్నారు. ఇప్పుడు రాజ్భవన్ వర్గాల సమాచారం ఇందుకు భిన్నంగా ఉంది. సీఎం స్వయంగా పిలవడంతోనే గవర్నర్ విచ్చేశారని పేర్కొన్నాయి.
అరెస్టులపై విచారణ వాయిదా
తొక్కిసలాట విషాదంలో ఆర్సీబీ మార్కెటింగ్ చీఫ్ నిఖిల్ సొసాలే అరెస్ట్పై దాఖలైన పిటిషన్ను హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. నిఖిల్ సొసాలే, సునీల్ మ్యాథ్యూ, కిరణ్కుమార్, శమంత్ మావినకెరె తదితరులు వేసిన పిటిషన్ ను న్యాయమూర్తి ఎం.విష్ణుకుమార్ విచారించారు. తమవారిని అరెస్టు చేయడం అక్రమమని, విడుదల చేయాలని వకీళ్లు వాదించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించడానికి సమయం కోరడంతో విచారణను బుధవారానికి వాయిదావేశారు.
రాజ్భవన్ ముట్టడికి యత్నం
తొక్కిసలాటను నిరసిస్తూ కన్నడ పోరాట నేత వాటాళ్ నాగరాజ్ చలో రాజ్భవన్ చేపట్టారు. జెండాలు పట్టుకుని రాజ్భవన్వైపు వెళ్తుండగా మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. వాటాళ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ సంస్థ తదితర క్రికెట్ సంస్థలన్నీ మృతుల కుటుంబాలకు భారీగా పరిహారం ఇవ్వాలని కోరారు. క్రీడా మైదానం వద్ద అమాయకుల మరణానికి కారణం ఎవరు?. ఇది న్యాయమా? తప్పు చేసినవారు ఎవరైనా గాని అపరాధి స్థానంలో నిలవాలన్నారు. అలాగే తొక్కిసలాట మీద సీబీఐతో విచారణ జరిపించాలని ఆర్పీఐ పార్టీ నేతలు స్వతంత్ర పార్కు వద్ద ధర్నా చేశారు.
ఆర్సీబీ విజయోత్సవాలకు
హాజరుపై రాజ్భవన్ వెల్లడి
తాను ఆహ్వానించలేదని గతంలో
చెప్పిన సీఎం సిద్దరామయ్య
హైకోర్టుకు అందని నివేదిక
బనశంకరి: తొక్కిసలాట దుర్ఘటనపై మీడియా వార్తలు, ప్రజల ఫిర్యాదుల ఆధారంగా హైకోర్టు సుమోటో గా కేసు నమోదు చేయడం తెలిసిందే. న్యాయమూర్తులు వీ.కామేశ్వరరావ్, సీఎం.జోషి తో కూడిన పీఠం మంగళవారం విచారణ చేపట్టింది. ఘటనపై పూర్తి నివేదిక అందించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఇదివరకే సూచించింది. కానీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఇంకా నివేదిక ఎందుకు రాలేదని జడ్జిలు ప్రశ్నించారు. అడ్వొకేట్ జనరల్ శశికిరణ్శెట్టి సమాధానమిస్తూ మెజస్టీరియల్ విచారణ, న్యాయ విచారణ జరుగుతోందని, ఒక నెల సమయం ఇవ్వాలని మనవిచేశారు. అయితే జూన్ 12 లోగా నివేదిక అందించాలని జడ్జిలు ఆదేశించారు.

సీఎం పిలిస్తేనే గవర్నర్ వెళ్లారు

సీఎం పిలిస్తేనే గవర్నర్ వెళ్లారు

సీఎం పిలిస్తేనే గవర్నర్ వెళ్లారు