
అలా జరిగిపోయింది.. మా తప్పేమీ లేదు
శివాజీనగర: బెంగళూరులోని చిన్నస్వామి క్రీడా మైదానం వద్ద ఆర్సీబీ విజయోత్సవంలో ఘోరమైన తొక్కిసలాట ఘటన జరగడంపై కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. ప్రభుత్వానికి, పార్టీ గౌరవానికి హాని జరిగిందని కినుక వహించింది. ఈ నేపథ్యంలో పెద్దల పిలుపులతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మంగళవారం ఢిల్లీలో పార్టీ అగ్రనేత రాహుల్గాంధీని కలిసి కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు.
హైకమాండ్కు నివేదిక
రాహుల్గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులను ఇరువురూ కలిశారు. రాష్ట్రంలో ఇటీవల నెలకొన్న పరిణామాలపై, అందులోనూ చిన్నస్వామి క్రీడా మైదానం వద్ద తొక్కిసలాట ఘటనపై నివేదికను అందజేశారు. ఈ దుర్ఘటనలో ప్రభుత్వం తప్పు లేదని సంజాయిషీ ఇచ్చినట్లు తెలిసింది. విజయోత్సవాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు, కేఎస్సీఏ ద్వారానే ఈ దోషం జరిగింది. విధానసౌధ ముందు నిర్వహించిన సన్మానోత్సవంలో ఎలాంటి లోపాలు జరగలేదు. చిన్నస్వామి క్రీడా మైదానంలో జరిగిన తొక్కిసలాటలో ప్రభుత్వం తప్పులేదని చెప్పినట్లు తెలిసింది.
రాహుల్ ఆగ్రహం
తొక్కిసలాటను ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా ఉపయోగించుకొంటున్నాయి. ఇది పార్టీకి అవమానమని రాహుల్గాంధీ కోపంగానే మాట్లాడారని తెలిసింది. పోలీసు అధికారులు సక్రమంగా ఏర్పాట్లు చేయలేదు. అందుచేతనే అధికారులపై చర్యలు తీసుకొన్నామని సీఎం తెలిపారు. మునుముందు ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకొంటామని రాహుల్కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. జాగ్రత్తగా ఉండాలని, ప్రతిపక్షాలకు అస్త్రం ఇవ్వరాదని హైకమాండ్ సూచించినట్లు తెలిసింది. ఖర్గేతో పాటు పార్టీ నేతలు వేణుగోపాల్, రణదీప్సింగ్ సుర్జేవాలతో భేటీలు జరిపారు.
తొక్కిసలాట దుర్ఘటనపై
రాహుల్గాంధీకి సీఎం,
డిప్యూటీ సీఎం వివరణ!
ఢిల్లీలో పార్టీ పెద్దలతో భేటీలు
మంత్రుల మార్పునకు పచ్చజెండా?
క్యాబినెట్ ప్రక్షాళన గురించి చర్చ
రాష్ట్రంలో మంత్రిమండలిలో మార్పుల గురించి ఢిల్లీ టూర్లో చర్చ జరిగినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన అపశృతులకు కొందరి అసమర్థతే కారణం, సక్రమంగా పని చేయని 7– 8 మంది మంత్రులను తొలగించి కొత్తవారిని కేబినెట్లోకి చేర్చుకోవాలని చర్చకు వచ్చిందని, మంత్రుల మార్పులకు రాహుల్గాంధీ ఆదేశించినట్లు సమాచారం. ఇందుకు సీఎం సిద్దరామయ్య ఆమోదించినట్లు తెలిసింది. వీలైనంత త్వరగా కేబినెట్ ప్రక్షాళన చేయాలని రాహుల్గాంధీ సూచించారు. దీంతో సీఎం, డీసీఎం ఢిల్లీ నుంచి రాగానే మంత్రుల మార్పుల చేర్పులపై కసరత్తు ప్రారంభిస్తారు. అలాగే కేపీసీసీ అధ్యక్షుని మార్పుపై కూడా చర్చలు జరిగాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమారే ఈ పదవిలో ఉండడం తెలిసిందే. ఇక 4 ఎమ్మెల్సీ పదవుల నామినేట్కు గవర్నర్ నుంచి అభ్యంతరాలు రాగా, ఏం చేయాలని అధిష్టానంతో మాట్లాడారని సమాచారం.