
పడకేసిన పారిశుధ్యం
రాయచూరు రూరల్: పేరుకు మాత్రమే జిల్లా కేంద్రం. అభివృద్ధిలో మాత్రం పూర్తిగా వెనుకబాటు. నగరంలో పారిశుధ్యం, రోడ్ల పరిస్థితి పల్లెల్లో మాదిరిగా అగమ్యగోచరం. ఇరు పార్టీల నేత పంతాల మధ్య నగరం అధ్వానంగా మారింది. నగరసభ అధికారం జిల్లాధికారి ఆధీనంలో ఉంది. ఏ ప్రాంతంలో చూసినా చెత్తకుప్పలు పేరుకు పోయి, మురుగు కాలువలు చిత్తు కాగితాలతో నిండాయి. రహదారుల పరిస్థితి దుర్భరంగా ఉంది. నగరంలోని 35 వార్డుల్లో పారిశుధ్యం, రోడ్ల పరిస్థితిని గురించి పట్టించుకొనే వారు లేరు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సభ్యులు ఒకరి మీద మరొకరు బురద చల్లుకుంటూ విమర్శలు చేసుకోవడమే తప్ప చేసిందేమీ లేదు. రహదారుల మరమ్మతులో నగరసభ, శాసన సభ్యుల మధ్య అవగాహన లేకపోవడంతో నగరంలో పేదల బతుకు నిత్యం నరకప్రాయమైంది.