
మాతంగ పర్వతంలో పర్యాటకుడు క్షేమం
●రక్షించిన పోలీసులు, అగ్నిమాపక దళం
హొసపేటె: ప్రపంచ ప్రఖ్యాత హంపీలోని మాతంగ పర్వతంలోని గుహలోకి జారిపడిన పర్యాటకుడిని పోలీసులు, అగ్నిమాపక దళం రక్షించాయి. మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన పర్వ అసత్(18)ను జారిపడిన యువకుడిగా గుర్తించారు. గత మూడు, నాలుగు రోజులుగా హంపీ పర్యటనలో ఉన్న ఆ యుకుడు ఆదివారం మధ్యాహ్నం హంపీలోని మాతంగ పర్వతాన్ని అధిరోహించాడు. పర్వతం మధ్యలోకి చూస్తుండగా అతను జారి పడిన ప్రదేశం నుంచి 15–20 అడుగుల లోతులో ఉన్న రాళ్ల మధ్య ఉన్న గుహలో చిక్కుకుపోయాడు. యువకుడు రాయిపైకి ఎక్కలేక సహాయం కోసం 112కు కాల్ చేశాడు. హంపీ టూరిస్ట్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందింది. ఎస్ఐ సుబ్రమణ్యం నేతృత్వంలోని పోలీసులు, అగ్నిమాపక దళం తాళ్లతో సంఘటన స్థలానికి చేరుకొని సురక్షితమైన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. పర్యాటకుడు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు.