
నేనేం పారిపోను: హోంమంత్రి
శివాజీనగర: స్టేడియ వద్ద తొక్కిసలాట కేసులో 11 మంది మరణించారు. ఇటువంటి సమయంలో పిరికివానిలా పరుగెత్తి వెళ్లిపోను అని హోం మంత్రి జీ.పరమేశ్వర్ అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన, నాకు హోం శాఖ అవసరం లేదని ఎవరితో చెప్పలేదు. నా భార్యతో కూడా చర్చించలేదు. నా గురించి తప్పుడు వార్తలను ప్రకటించి వ్యక్తిత్వాన్ని హత్య చేయవద్దని అన్నారు. ఇటువంటి వార్తలను ఎవరు సృష్టిస్తున్నారో అని వాపోయారు. తొక్కిసలాట ఘటన బాధ కలిగించింది. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంది. శాఖ మార్చాలని సీఎంను కోరలేదు అన్నారు. మంగళూరులోని హిందూ కార్యకర్త సుహాస్శెట్టి హత్య కేసును ఎన్ఐఏకు అప్పగించారు, మేం కూడా తగిన నిర్ణయం తీసుకుంటాం, ప్రభుత్వం పంపిన నలుగురు ఎమ్మెల్సీల జాబితాను గవర్నర్ నిలిపివేయడం తనకు తెలియదన్నారు.
ఘరానా దొంగకు సంకెళ్లు
మైసూరు: జిల్లాలోని టి. నరసిపుర టౌన్ పరిధిలోని దొంగతనాలు చేస్తున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. మైసూరు సిటీకి చెందిన సయ్యద్ సల్దానా అలియాస్ కబూతర్ (35)ను అరెస్ట్ చేశారు. ఇటీవల టి.నరసిపురలో ఒక మెడికల్ స్టోర్లో డబ్బు ఎత్తుకెళ్లాడు. తలకాడ్లో రెండు, బన్నూరులో రెండు, హెచ్డి కోటేలో ఒకటి, మైసూరు నగరంలో ఒకటి ఇలా పలు ప్రాంతాలలో చోరీలకు పాల్పడి, అరెస్టు కావడం, బయటకు వచ్చి మళ్లీ దొంగతనాలు చేయడం వృత్తిగా మార్చుకున్నాడు. మొత్తం 18 కేసులు నమోదయ్యాయి. నిందితుని నుంచి కొత్త అపాచీ బైక్, రూ. 40 వేల నగదు, మూడు మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. మరో నిందితుడు నయాజ్ కోసం గాలిస్తున్నట్లు సీఐ ధనంజయ్, ఎస్ఐ జగదీష్ తెలిపారు.
ఆలయాలలో ప్లాస్టిక్ నిషేధం
● మంత్రి రామలింగారెడ్డి
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో ఉన్న దేవాదాయశాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో పాటు అన్ని రకాల ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు దేవాదాయశాఖ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. వికాససౌధలో శాఖ ప్రగతి పరిశీలనా సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 15 నుంచి ఈ నిబంధనలు అమలవుతాయన్నారు. ఇంకా 2 నెలల సమయం ఉన్నందున అందరూ అనుసరించాలని కోరారు. దేవాదాయశాఖ పరిధిలోని దేవాలయాల సంఖ్య, వాటి ఆస్తులు తదితర అంశాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దేవాలయాల్లో పూజారులకు డీబీటీ ద్వారా తస్తీక్ అందిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ధార్మిక పరిషత్లను ఏర్పాటు చేయాలన్నారు. తిరుపతి, తుళజాపుర, పండరీపుర తదితర పుణ్యక్షేత్రాల్లో వసతి భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. హులిగమ్మ, మలె మహదేశ్వర, ఘాటి సుబ్రమణ్య, రేణుకా యల్లమ్మ, చాముండేశ్వరి దేవాలయాల సమగ్ర అభివృద్ధి ప్రాధికార మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
వంతెన మీద నుంచి దూకి ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: ఎంత కష్టం వచ్చిందో గానీ.. ఫ్లై ఓవర్ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు కొడిగేహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హెబ్బాళ నివాసి మునిరాజు (22) ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసేవాడు. ఆదివారం అర్ధరాత్రి జక్కూరు ఫ్లై ఓవర్ ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలిసిరాలేదు. కొడిగేహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
పాము కాటుతో బాలిక బలి
దొడ్డబళ్లాపురం: పాము కాటు వేయడంతో బాలిక మృతిచెందిన సంఘటన దావణగెరె జిల్లా జగళూరు తాలూకా గడిమాకుంటె గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ నివాసి మలియప్ప కుమార్తె మాలిని (13) మృతురాలు. తల్లిదండ్రులతో కలిసి మాలిని పొలం పనులకు వెళ్లిన సమయంలో పాము కాటు వేసింది. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆస్పత్రికి బైక్పై తరలిస్తుండగా దారి మధ్యలో చనిపోయింది. మృతురాలు దావణగెరెలోని ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదివేది. ఎమ్మెల్యే దేవేంద్రప్ప మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు.