
అమ్మవారికి వేరుశెనగల అలంకారం
బనశంకరి: భక్తుల కొంగుబంగారమైన బనశంకరీ దేవి వేరుశెనగ గింజల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. సోమవారం వేకువజామున అర్చకులు ఏ.చంద్రమోహన్ ప్రత్యేక అర్చన, అభిషేకం గావించి వేరుశెనగలతో విశేషంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధన చేశారు.
సస్పెన్షన్పై క్యాట్కు ఐపీఎస్
బనశంకరి: చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట దుర్ఘటనలో నగర పశ్చిమ అదనపు పోలీస్ కమిషనర్ వికాస్కుమార్ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం తెలిసిందే. ఆయన ఈ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ పాలనా ట్రైబ్యునల్– క్యాట్లో పిటిషన్ వేశారు. తన సస్పెన్షన్ అక్రమమని, దీనిని కొట్టివేయాలని కోరారు.
హైకోర్టులో ఆర్సీబీ పిటిషన్
తొక్కిసలాట ఘటనలో తమపై నమోదైన క్రిమినల్ కేసు రద్దుచేయాలని ఆర్సీబీ జట్టు నిర్వాహకులు సోమవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ కూడా కేసు దాఖలు చేసింది. తమను కావాలనే ఇరికించారని, పరిమితమైన పాస్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ప్రకటించామని తెలిపారు. మధ్యాహ్నం 1:45 గంటలకు తెరవాల్సిన స్టేడియం గేట్లను మధ్యాహ్నం 3 గంటలకు తెరిచారు. దీంతో రద్దీ పెరిగిపోయిందని ఆరోపించారు.
సిద్దు, శివకు హైకమాండ్ పిలుపు
శివాజీనగర: చిన్నస్వామి స్టేడియం దుర్ఘటన జరిగి సిద్దరామయ్య సర్కారు మీద విమర్శలు వస్తుండడంతో కాంగ్రెస్ హైకమాండ్ కొన్ని చర్యలను తీసుకునే అవకాశముంది. సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్కు హైకమాండ్ పిలుపునిచ్చింది. వారు ఢిల్లీకి వెళ్లనున్నారు. డీకే ఇప్పటికే చేరుకోగా, సీఎం మంగళవారం వెళతారు. తొక్కిసలాట ఘటన పరిణామాలపై మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీ తదితర నాయకులు వివరణ కోరనున్నారని తెలిసింది. ప్రభుత్వంలో కొన్ని మార్పులు జరిగినా ఆశ్చర్యం లేదని సమాచారం.
డివైడర్కు కారు ఢీ..
ఇద్దరు మృతి
మాలూరు: చైన్నె– బెంగుళూరు రహదారిలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని ఇద్దరు మరణించారు. కారులో ప్రయాణిస్తున్న పొగాకు వ్యాపారులు అశోక్ (28), మోహన్లాల్ (32) మృతులు. వీరు మూలతః రాజస్థాన్కు చెందిన వారు. దేవనగొంది సమీపంలో ఉన్న దేవలాపుర గ్రామంలో పొగాకు దుకాణం నడిపేవారు. తమ కారులో పొగాకు ప్యాకెట్లు నింపుకొని చైన్నె – బెంగుళూరు రహదారిలో వెళ్తున్నారు. ఎడిగినబెలె గ్రామ సమీపం వద్ద రోడ్డు డివైడర్ను ఢీకొని కారు తుక్కుతుక్కయింది. ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మాలూరు పోలీసులు చేరుకుని కారు శిథిలాలను పక్కకు తొలగించి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

అమ్మవారికి వేరుశెనగల అలంకారం