
మెట్రో రైలు టికెట్లకు, కాలుష్యానికి లింక్
బనశంకరి: రాజధానిలో నమ్మ మెట్రో రైలు టికెట్ ధరల పెంపు వల్ల ప్రయాణికుల సంఖ్య కొంచెం తగ్గుముఖం పట్టింది. దీని వల్ల నగరంలో వాయు కాలుష్యం పెరిగినట్లు నిర్ధారణ కావడం విశేషం. మెట్రో రైలు టికెట్లకు, కాలుష్యానికి సంబంధం ఏమిటని ఆశ్చర్యపోవచ్చు. జాతీయ వాయు నాణ్యత పర్యవేక్షణా కేంద్రం నివేదికలో ఇదే వెలుగుచూసింది. భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్సీ) సుస్థిర రవాణా రంగంలో అధ్యాపకుడైన ఆశిశ్ వర్మ నేతృత్వంలోని బృందం అధ్యయనం చేసింది. డబుల్ డెక్కర్ రహదారుల్లో కాలుష్యం పెరిగినట్లు తేలింది. అలాగే మెట్రోరైలు టికెట్ ధర పెంపు వల్ల జనం మళ్లీ కార్లు, బైక్లు, ట్యాక్సీలలో ప్రయాణం చేయసాగారు, ఇలా వాహనాల సంఖ్య పెరిగింది. మెట్రోలో 5 శాతం ప్రయాణికులు తగ్గితే అదే శాతం ప్రయాణికులు ఇతర వాహనాలను ఆశ్రయించారు. ఇది వాయు కాలుష్యానికి, కొంత ట్రాఫిక్ సమస్యకు కారణమైందని ఐఐఎస్సీ నిపుణులు పేర్కొన్నారు.
కాలుష్య ప్రమాణాల్లో మార్పు
టికెట్ల పెంపునకు ముందు, తరువాత జయనగర 5 వ బ్లాక్లో కాలుష్యనియంత్రణ మండలి పర్యవేక్షణ కేంద్రంలో వాయు నాణ్యతను లెక్కించారు. జనవరి 27న ఉదయం 75 ఏక్యూఐ, సాయంత్రం 71 ఏక్యూఐ, ఫిబ్రవరి 3 తేదీ ఉదయం 71 ఏక్యూఐ, సాయంత్రం 77 ఏక్యూఐ ఉంది. టికెట్లు పెరిగిన తరువాత ఉదయం 117 ఏక్యూఐ, సాయంత్రం 114 ఏక్యూఐ నమోదైంది.
టికెట్ల రేట్లు పెరగ్గానే వాయు
మాలిన్యం అధికం
ప్రజలు కార్లు, బైక్లలో ప్రయాణాలే కారణం
ఐఐఎస్సీ అధ్యయనంలో వెల్లడి
సౌకర్యాల కల్పన ముఖ్యం
మెట్రో టికెట్ ధరల పెంపు వల్ల ప్రత్యేకంగా తక్కువ, మధ్య తరగతి కుటుంబాలకు ఇబ్బందిగా ఉంది. టికెట్ రేట్ల పెంపు నష్టాన్ని ప్రభుత్వాలు తెలుసుకోవాలి. లేని పక్షంలో సామాజికంగా, ఆర్థికంగా, ప్రకృతిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆశిశ్వర్మ తెలిపారు. సొరంగ మార్గాలు, డబుల్ డెక్కర్ రోడ్లలో కాలుష్యం ఎక్కువైంది. ప్రజారవాణా వ్యవస్థలను ఉపయోగించడం పెరగాలి. పనికిరాని పథకాలకు కోట్లాది రూపాయలు వ్యయం చేసే బదులు బస్సులు, మెట్రో రైలు వ్యవస్థలను విస్తరించడం ఉత్తమం. ప్రజల ఆరోగ్యం కోసమైనా నగరంలో సౌకర్యాలను రూపొందించాలని సలహా ఇచ్చారు.

మెట్రో రైలు టికెట్లకు, కాలుష్యానికి లింక్

మెట్రో రైలు టికెట్లకు, కాలుష్యానికి లింక్