
ఆస్తమా మందు.. మనకే ముందు
● కొప్పళ వద్ద కూటగానహళ్లిలో జనజాతర
రాయచూరు రూరల్: ఆస్తమా, ఉబ్బసం సమస్యలకు హైదరాబాద్లో చేపమందు ఇస్తారన్నది తెలిసిందే. మృగశిర కార్తె మొదలు కాగానే మందు పంపిణీ ఆరంభిస్తారు. ఇదే మాదిరిగా కొప్పళ జిల్లాలో ఓ గ్రామంలో ఆస్తమాకు ఆయుర్వేద మందును పంపిణీ చేస్తారు. ఇందుకోసం అనేక రాష్ట్రాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. ఆదివారం కూటగానహళ్లి బృహత్ జాతరను తలపించింది. పేదలు, ధనవంతులు అనే తేడా లేకుండా మందు కోసం వచ్చారు. గ్రామంలోని పాఠశాలలో కులకర్ణి కుటుంబం ఈ మందును పంపిణీ చేస్తోంది. మృగశిర కార్తెలో చంద్రుడు, నక్షత్ర గమనాన్ని అంచనా వేసి మందును పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ ఆయుర్వేద మందు ఆస్తమా, ఉబ్బసంతో పాటు శ్వాసకోశ వ్యాధులకు రామబాణమని చెప్పారు. ఎండల వేడిమి ఉన్నప్పటికీ ప్రజలు గొడుగులు పట్టుకుని మందు కోసం నిరీక్షించారు.