
ఐస్క్రీంతో జర జాగ్రత్త
బనశంకరి: ఐస్క్రీం అనగానే పిల్లలైనా, పెద్దలైనా ఎవరికైనా నోరూరుతుంది. వేసవిలో ఎండలు తీవ్రరూపం దాల్చడంతో చల్లదనం కోసం, కాలక్షేపానికి ఐస్క్రీములు తినేవారు జాగ్రత్తగా ఉండాలి. ఐస్క్రీమ్ కేంద్రాలలో ఆహార సురక్షతా శాఖ అధికారులు సోదాలు చేసి శాంపిళ్లను ల్యాబ్కు తరలించారు. ప్లాస్టిక్ పేపర్లో ఇడ్లీ, కర్బూజా, కలర్ వేసిన కబాబ్, గోబిమంచూరి, పన్నీర్లలో ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలున్నాయని ఇప్పటివరకు తనిఖీలలో తేలింది. ఇప్పుడు చల్లని ఐస్క్రీమ్ వంతు వచ్చింది. ఆహార శాఖ అధికారులు ప్రతినెలా ఆహార పదార్థాలను తనిఖీ చేస్తారు. ఎండాకాలంలో ప్రజలు ఐస్క్రీములు ఎక్కువగా తింటున్నారు. ఐస్క్రీములకు రంగు రావడానికి కృత్రిమ రంగులను వాడతారు. ఈ రంగులు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.
అథణిలో బాగోతం
ఇటీవల బెళగావి జిల్లాలోని అథణిలో అనుమతులు లేని ఓ ఫ్యాక్టరీలో రంగురంగుల ఐస్ క్యాండీలను తయారు చేయడం చూసి తనిఖీలు చేశారు. ఐస్క్రీంలను ల్యాబ్కు పరీక్షల కోసం పంపించగా వాటిలో హానికరమైన అంశాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. రంగు రావడానికి కెమికల్స్ వినియోగిస్తారని, అవి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. సన్సెట్ ఎల్లో, సన్సెట్ గ్రీన్ కలర్లు శరీరంలోకి వెళ్తే క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంటుందన్నారు. ఇదే కాకుండా గుండె రోగాలు, కిడ్నీ సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరించారు. ఐస్క్రీంలు, కేక్ ఉత్పత్తిలో కల్తీ రంగులు, రసాయనాలను వాడరాదని తెలిపారు.
అందులో హానికారక రంగుల వాడకం
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

ఐస్క్రీంతో జర జాగ్రత్త