విద్యార్థిని కావేరి (ఫైల్)
దొడ్డబళ్లాపురం: టంటం వాహనం ఢీకొని కాలేజీ విద్యార్థిని మృతిచెందిన సంఘటన బెళగావి జిల్లా చెన్నమ్మ కిత్తూరు పట్టణంలో చోటుచేసుకుంది. కిత్తూరు డిగ్రీ కాలేజీలో 3వ సెమిస్టర్ చదువుతున్న కావేరి బసప్ప (20) బుధవారంనాడు కాలేజీ ముగించుకుని కావేరి ఇంటికి నడిచి వెళ్తుండగా వేగంగా వచ్చిన టంటం ఆటో వాహనం ఆమెను ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆస్పత్రికి తరలించేలోపే మరణించింది. వాహన డ్రైవర్ అనిల్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా నడిపి యువతి ప్రాణం తీశాడు. నిందితున్ని అరెస్టు చేశారు.
కాలేజీ పై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
బనశంకరి: బెంగళూరులో పేరుపొందిన ప్రైవేటు యూనివర్శిటీలో చదువుతున్న డిగ్రీ విద్యార్థి ఆరో అంతస్తుపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన పరప్పన అగ్రహార పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. హొంగసంద్ర రాఘవేంద్ర లేఔట్ నివాసి విఘ్నేశ్(19) మృతిచెందిన విద్యార్ది. ఎలక్ట్రానిక్ సిటీ ప్రైవేటు యూనివర్శిటీ కాలేజీలో బీబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం ఇంజనీరింగ్ కాలేజీ ఆరో అంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాలతో మరణించాడు. అగ్రహరపోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. గత ఏడాది అక్టోబరులో ఇదే కాలేజీలో 20 ఏళ్ల విద్యార్థి కూడా ఇదే మాదిరి ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలో భవనాల మీద నుంచి దూకి విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే సంఘటనలు పెరిగాయి.


