నాన్న కాదు.. నర హంతకుడు
శ్రీనివాసపురం: కన్న తండ్రే కాలయముడై కొడుకును కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన కోలారు జిల్లా ముళబాగిలు తాలూకా నంగలి గ్రామంలో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. భువన్ తేజ(8) తండ్రి చేతిలో హత్యకు గురైన బాలుడు. వివరాలు...బెంగళూరు యలహంకలో ఉంటున్న సుబ్రమణి నంగలికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. వీరు కూలిపనులు చేసుకునేవారు. ఈ జంటకు కొడుకు భువన్ తేజ జన్మించాడు. అయితే యేడాది క్రితం భువన్ తల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పటి నుంచి భువన్తేజ తండ్రి దగ్గరే యలహంకలో ఉంటూ అక్కడి ఓ ప్రైవేటు పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. అయితే రెండు రోజుల క్రితం ఇంట్లో తండ్రికి చెప్పకుండా బస్సులో నంగలిలోని తన అవ్వ ఇంటికి బయలుదేరి వచ్చాడు. మధ్యలో దారితప్పగా స్థానికులు, పోలీసులు అతని వివరాలడిగి అవ్వ ఇంటికి చేర్చారు.
నీ వెంట బెంగళూరుకు రాననడంతో..
అదే రోజు రాత్రి నంగలికి తన కొడుకును వెతుక్కుంటూ వచ్చిన తండ్రి సుబ్రమణి రాత్రికి తనతో బెంగళూరుకు రావాలని భువన్తేజను ఒత్తిడి చేయగా బాలుడు రానని చెప్పాడు. చివరికి తెల్లవారు జామున తాను బెంగళూరు వెళుతూ తనతో పాటు తీసుకు వెళ్లడానికి కొడుకు భువన్తేజను నిద్ర లేపాడు. తాను అవ్వతోనే ఉంటానని తెలిపాడు. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న సుబ్రమణి కత్తి తీసుకుని భువన్ గొంతుపై పొడవడంతో తీవ్ర రక్తస్రావమై పసివాడి ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. అవ్వ గట్టిగా కేకలు వేయగా స్థానికులు చేరుకున్నారు. సమాచారం అందుకున్న నంగలి పోలీసులు సుబ్రమణిని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నెలల కిందట కూతురును, ఇప్పుడు మనవన్ని తీసుకుపోయావా దేవుడా అని వృద్ధురాలు విలపించడం చూసి అందరి కళ్లు చెమర్చాయి.
భువన్తేజ(ఫైల్) కిరాతక తండ్రి సుబ్రమణి
కత్తితో పొడిచి చిన్నారి కొడుకు హత్య
కోలారు జిల్లా నంగలిలో దారుణం
ఏడాది కిందటే తల్లి ఆత్మహత్య