
జీపీవోలే ప్రభుత్వానికి కళ్లు, చెవులు
కరీంనగర్ అర్బన్: గ్రామస్థాయిలో ప్రజలకు, రైతులకు మేలు జరగాలనే ప్రభుత్వ సంకల్పం జీపీవో (గ్రామ పాలన అధికారులు)లు నెరవేర్చాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. ఇటీవల రెవెన్యూ శాఖలో నియామకమైన జీపీవోలు అంకితభావంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో గ్రామ పాలన అధికారుల ఆత్మీయ సమ్మేళనం కరీంనగర్ కలెక్టరేట్ రోడ్డులోని రెవెన్యూ గార్డెన్స్లో జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన జీపీవోలకు భూభారతి చట్టంపై అవగాహన, విధులు, బాధ్యతలతో పాటు పారదర్శకత, అంకితభావంతో కూడిన పౌరసేవలపై దిశానిర్దేశం చేశారు. ఏ ఒక్కరు తప్పు చేసినా అది మొత్తం వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందన్నారు. జీపీవోల సమస్య తీరిందని, ఇతరుల సమస్యలను విస్మరించవద్దన్నారు. కారుణ్య నియామకాలకు సంబంధించి త్వరలోనే తీపి కబురు వస్తుందన్నారు. ఉద్యోగుల జేఏసీ చైర్మైన్ లచ్చిరెడ్డి సారధ్యంలో గ్రామ పాలన అధికారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి అన్నారు. టీజీటీఏ జనరల్ సెక్రటరీ రమేశ్ పాక మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు యువత ఎంత కీలకమో, రెవెన్యూ వ్యవస్థకు జీపీవోలు అంతే కీలకమన్నారు. టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.బిక్షం, రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ చిల్లా శ్రీనివాస్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కరీంనగర్ నగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నేరేళ్ల కిషన్, రమేష్, టీజీటీఏ కరీంనగర్ నగర్ కార్యదర్శి రాజేశ్వరి, నవాజ్ షరీఫ్, రిటైర్డ్ తహసీల్దార్ గంప శంకరయ్య, మల్లారం అర్జున్, ఆంజనేయ ప్రసాద్, సాయి కిషోర్, బాపుదేవ్ తదితరులు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో నిబద్ధతతో పని చేయండి
జీపీవోల ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి