
‘ప్రైవేటు’ దోపిడీ
కరీంనగర్: జిల్లాకేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో నియంత్రణ లేని ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అడ్మిషన్, మెయింటనెన్స్, స్పెషల్ ఫీజులంటూ నిలు వుదోపిడీ చేస్తున్నారు. పుస్తకాలు, నోట్బుక్లతో పాటు పాఠశాలపేర్లతో ఉన్న బ్యాగులు సైతం విక్రయిస్తున్నారు. ఒక్కో వస్తువుకు పదింతల ధ రలు వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. పాఠశాలలు ప్రారంభమై వారం రోజులు అవుతున్నా తనిఖీలు చేయడం లేదు.
పుస్తకాల ధరలకు రెక్కలు
బయట దుకాణాల్లో పుస్తకం ధర రూ.20 ఉంటే పాఠశాలలో రూ.25 నుంచి రూ.35వరకు తీసుకుంటున్నారు. మరికొన్ని పాఠశాలల్లో రూ.40 కన్నా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఒకటో తరగతి 16 టెక్ట్స్బుక్స్, 14 నోట్బుక్స్కు కలిపి రూ.6300కు పైగా వసూలు చేస్తున్నారు. రెండో తరగతి 14 టెక్ట్స్బుక్స్కు, 21 నోట్బుక్స్కు రూ.6,500, మూడో తరగతి 12 టెక్ట్స్బుక్స్, 22 నోట్బుక్స్కు కలిపి 6,700 తీసుకుంటున్నారు. వీటికి తోడు పెన్నులు, పెన్సిళ్లు, కవర్లు అంటూ రెట్టింపు ధరలకు అంటగడుతున్నారు.
ఆకాశంలో బ్యాగుల ధరలు
కళ్లు చెదిరే డిజైన్లు, రంగులతో చాలా రకాల బ్యా గులు అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లల బ్యాగులు దాదాపు రూ.300 నుంచి దాదాపు రూ.700వరకు పలుకుతున్నాయి. మోడల్ను బట్టి రూ.1000 వరకు చెబుతున్నారు. కొందరు తమ పాఠశాలల పేర్లతో స్కూళ్లలోనే బ్యాగులు విక్రయిస్తున్నారు. ఫలితంగా ఉచితంగా పబ్లిసిటీ పొందుతున్నారు. ఇది చట్టప్రకారం నిషేధమైనప్పటికీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. పలు పాఠశాలలు తప్పనిసరిగా బ్రాండెడ్ షూ కొనుగోలు చేయాలని చెప్పడంతో ఒక్కోజత రూ.750 వరకు పలుకుతోంది.
యూనిఫాంలు అటువైపుగానే
జిల్లాకేంద్రంలో వందల సంఖ్యలో పాఠశాలలు వీదికొకటి ఏర్పడ్డాయి. యాజమాన్యం సూచించిన యూనిఫాంలనే విద్యార్థులు విధిగా ధరించాలి. ఇక్కడా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నారు. తాము చెప్పిన షాపులోనే తమ పాఠశాల యూనిఫాం తీసుకోవాలని హుకూం జారీ చేస్తున్నారు. దీంతో ఆయా దుకాణాల యాజమాన్యాలు సైతం ధరలు పెంచి విక్రయిస్తుండగా.. పాఠశాల నిర్వాహకులు కమీషన్ దండుకుంటూ తల్లిదండ్రులకు కుచ్చుటోపీ పెడుతున్నారు. ప్రస్తుతం పాఠశాల యూనిఫాం జతకు రూ.1,200 నుంచి రూ.1,500 పలుకుతోంది.
ప్రైవేటు స్కూళ్లలో నిబంధనలకు నీళ్లు
పెన్సిల్ నుంచి నోట్బుక్స్ వరకు అక్కడే కొనుగోలు
చుక్కలు చూపుతున్న ధరలు
బెంబేలెత్తుతున్న తల్లిదండ్రులు
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
చర్యలు తప్పవు
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. పాఠ్యపుస్తకాలు, తదితర వస్తువులు అధిక ధరలకు అమ్మడం నిబంధనలకు విరుద్ధం. ఫీజుల విషయంలో ప్రభుత్వ జీవోలకు అనుగుణంగా వ్యవహరించాల్సిందే. త్వరలోనే పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తాం. ఏ పాఠశాలలోను పుస్తకాలు, నోట్బుక్స్ అమ్మడానికి వీలులేదు. అలాంటివి జరిగితే చర్యలు తప్పవు.
– శ్రీరామ్ మొండయ్య, డీఈవో

‘ప్రైవేటు’ దోపిడీ