
‘డిగ్రీ’ డౌన్!
● తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య ● శాతవాహనలో సగం సీట్లు ఖాళీ ● ఇప్పటి వరకు 10,265 సీట్ల భర్తీ ● ఇంజినీరింగ్, మెడిసిన్, వివిధ కోర్సులపై ఆసక్తి ● ప్లేస్మెంట్లు లేకపోవడమే కారణమంటున్న విద్యావేత్తలు
కరీంనగర్క్రైం: డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఇంటర్ పూర్తికాగానే చాలామందికి డిగ్రీ కన్నా ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్, ఫార్మసీతో పాటు వివిధ కోర్సులపై ఆసక్తి పెరుగుతోంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు వచ్చినప్పటికీ డిగ్రీలో సీట్ల భర్తీ తగ్గుతోందని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇతర కోర్సులపై ఆసక్తి ఉండడంతో పాటు ఇప్పుడు కొత్తగా వచ్చిన డిగ్రీ కోర్సుల తర్వాత విదేశాలకు వెళ్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు రెండు దశల్లో దోస్త్ ద్వారా సీట్లు కేటాయింపు ప్రక్రియ జరిగినప్పటికీ శాతవాహనలో 10,265 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
ఏటేటా తగ్గుతున్న వైనం
ఏటా డిగ్రీలో చేరే వారి సంఖ్య తగ్గుతూ వ్తోంది. 2025–26లో ఇప్పటి వరకు రెండు దశలు పూర్తికాగా ఇప్పటి వరకు 10,265 సీట్లు మాత్రమే కేటాయింబడ్డాయి. మొదటి దశలో 5,931 సీట్లు కేటాయించబడగా ఇందులో 4,334 సీట్లు మాత్రమే విద్యార్థులు కన్ఫార్మ్ చేసుకున్నారు. రెండోదశలో 4,334 సీట్లు కేటాయించారు. రెండో దశలో సీటు పొందిన వారు బుధవారం వరకు మాత్రమే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీట్లు ఖరారు చేసుకోవాల్సి ఉందని శాతవాహన ప్రవేశాల విభాగం ప్రకటించింది.
కనిపించని ప్లేస్మెంట్లు
కోర్సులు పూర్తయ్యాక ఉద్యోగ, ఉపాధి కల్పనకు అవకాశాలు ఎక్కువగా లేకపోవడంతోనే డిగ్రీ కోర్సుల్లో ఎక్కువగా విద్యార్థులు చేరడం లేదనే చర్చ సాగుతోంది. వివిధ రంగాల్లో ప్రైవేటు కంపెనీలు ఎక్కువగా ప్రొఫెషనల్ కోర్సులు, ఇంజినీరింగ్ చేసిన వారినే నియమించుకోవడంతో డిగ్రీవాళ్లకు అవకాశాలు తగ్గిపోతున్నాయని తెలుస్తోంది. డిగ్రీ కళాశాలల్లో సైతం కోర్సులు పూర్తయ్యాక ప్లేస్మెంట్ సరిగా రావడంలేదని స్పష్టమవుతోంది. దోస్త్ మూడోదశ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు కొనసాగుతుండగా గురువారం గడువు ఉంది. మూడోదశ సీట్ల కేటాయింపు 23వ తేదీన జరగనుంది. డిగ్రీలో సాంప్రదాయ కోర్సులు కాకుండా పెద్ద ఎత్తున మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్తకోర్సులు వచ్చినప్పటికీ డిగ్రీలో చేరే సంఖ్య పెరగడం లేదని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలు
ప్రభుత్వ కళాశాలలు: 13
ప్రభుత్వ ఆటానమస్: 02
ప్రైవేటు ఎయిడెడ్: 02
ప్రైవేటు ఆన్ ఎయిడెడ్: 58
సోషల్ వెల్ఫేర్: 03
ట్రైబల్ వెల్ఫేర్: 02
బీసీ వెల్ఫేర్: 03
శాతవాహనలో మొత్తం సీట్లు: 36,060
విద్యా సంవత్సరం సీట్ల భర్తీ
2022–23 20,218
2023–24 16,419
2024–25 16,500
2025–26 10,265
(రెండుదశలు పూర్తయ్యాక)