
కారును ఢీకొన్న వ్యాన్: ఇద్దరికి గాయాలు
మల్యాల: మండలంలోని ముత్యంపేట శివారు దిగువ కొండగట్టు వద్ద కారును డీసీఎం వ్యాన్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామానికి చెందిన బిరుదుల సాయికిరణ్ బుధవారం మల్యాలకు చెందిన మ్యాక గంగోత్రిని పూడురులోని వారి బంధువుల ఇంట్లో దించేందుకు కారులో వెళ్తున్నాడు. ముత్యంపేట శివారులో జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారిపై జగిత్యాల వైపు వెళ్తున్న డీసీఎం వ్యాను వేగంగా వచ్చి కారును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న సాయికిరణ్, గంగోత్రి తీవ్రంగా గాయపడ్డారు. 108 సిబ్బంది బాధితులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సాయికిరణ్ తల్లి పద్మ ఫిర్యాదు మేరకు డీసీఎం వ్యాను డ్రైవర్ జితేంద్రపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.