
భూసమస్యల పరిష్కారమే లక్ష్యం
గన్నేరువరం/తిమ్మాపూర్: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం గన్నేరువరం కల్యాణమండపంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్తో కలిసి పాల్గొన్నారు. చట్టంలోని అంశాలను రైతులు, ప్రజలకు వివరించారు. సీసీఎల్ఏకు వెళ్లే అవసరం లేకుండా ఆర్డీవో, కలెక్టర్ వద్దే భూసమస్య పరిష్కరించుకునేందుకు అవకాశాలున్నాయన్నారు. అభ్యంతరాలు ఉంటే అప్పీల్ చేసుకోవచ్చన్నారు. చిన్న సమస్యలు మండల స్థాయిలోనే త్వరితగతిన పరిష్కారమవుతాయని వివరించారు. మనిషికి ఆధారుకార్డులాగే భూమికి భూధార్ సంఖ్య కేటాయిస్తారని తెలిపారు. తప్పుల సవరణ కోసం చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పెండింగ్లో ఉన్న సాదాబైనామాల పరిష్కారం కోసం భూభారతిలో అవకాశం కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి భాగ్యలక్ష్మి, తహసీల్దార్ ఇప్ప నరేందర్, ఇన్చార్జి ఎంపీడీవో శ్రీనివాస్, ఏవో కిరణ్మయి పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో...
అంగన్వాడీల్లో ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య బోధిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరంలో ఆరేళ్లలోపు పిల్లలందరినీ కేంద్రాల్లో చేర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఐసీడీఎస్, కరీంనగర్ రూరల్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీకాలనీలోని దుర్గాబాయి మహిళా శిశు వికాసకేంద్రంలో గురువారం వివిధ రకాలు ప్రదర్శనలు చేపట్టారు. కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. చిన్నారుల మానసిక పరిపక్వత కోసం ప్రత్యేకంగా సిలబస్ తయారు చేసినట్లు వివరించారు. ప్రదర్శనశాలలో అంగన్వాడీ కేంద్రాల్లో బోధించే పరికరాలు, నెలవారీగా సిలబస్ వివరాలు, కిచెన్ గార్డెన్స్ ఆకట్టుకున్నాయి. అనంతరం ఈఏడాది పూర్వ ప్రాథమిక విద్య పూర్తిచేసిన చిన్నారులకు కలెక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సబిత, సీడీపీవో, ప్రాంగణం మేనేజర్ సుధారాణి, డీసీపీవో పర్విన్ పాల్గొన్నారు.
అమల్లోకి భూ భారతి
కలెక్టర్ పమేలా సత్పతి