
రమీజ్ను అభినందిస్తున్న డైరెక్టర్ సునీతారెడ్డి
కరీంనగర్ స్పోర్ట్స్: హైదరాబాద్లో ఈ నెల 24 నుంచి 26 వరకు 67వ రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్–14 బాలబాలికల స్విమ్మింగ్ పోటీలు నిర్వహించనున్నారు. వీటికి కరీంనగర్లోని మానేరు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థి రమీజ్ ఎంపికై నట్లు పీఈటీ మహేందర్ తెలిపారు. బుధవారం కరీంనగర్లో జరిగిన ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల్లో రాణించాడని పేర్కొన్నారు. గురువారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థిని మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి అభినందించారు. రాష్ట్ర పోటీల్లో పతకం సాధించి, జాతీయ పోటీలకు ఎంపికవ్వాలని ఆకాంక్షించారు. విద్యాసంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి, ప్రిన్సిపాల్ సరితారెడ్డి, ఉపాధ్యాయులున్నారు.
వాహనాల తనిఖీ
కరీంనగర్ క్రైం: కరీంనగర్ త్రీటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో పోలీసులు, స్పెషల్ యాక్షన్ టీంల ఆధ్వర్యంలో గురువారం వాహనాల తనిఖీ చేపట్టారు. సున్నితమైన ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలకు భరోసా కల్పించారు. కార్యక్రమంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్, త్రీ టౌన్ సీఐ శ్రీనివాస్, వన్ టౌన్ సీఐ రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
మద్యం విక్రయించినందుకు నోటీసు
హుజూరాబాద్రూరల్: మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన నందిపట్ల రాజేందర్ అక్రమంగా మద్యం విక్రయించినందుకు పోలీసులు గురువారం క్రమశిక్షణ నోటీసులు అందజేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు గ్రామాల్లో మద్యం విక్రయించొద్దని ఆదేశాలు ఉన్నాయని, తహసీల్దార్ ఎదుట సైతం బైండోవర్ చేసినా లెక్క చేయకుండా మద్యం విక్రయించాడని అందుకే నోటీసులు జారీ చేశామని సీఐ శ్రీనివాస్ తెలిపారు.
ఎస్టీయూ జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షుడిగా దేవేందర్రావు
సుల్తానాబాద్: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షుడిగా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ఉపాధ్యాయుడు గండ్ర దేవేందర్రావును జిల్లా అధ్యక్షుడు మెరుగు సతీశ్, ప్రధాన కార్యదర్శి మందలశ్రీకాంత్రెడ్డి ప్రకటించారు. సుల్తానాబాద్ మండలం నుంచి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా మడ్డి కొమురయ్య, జిల్లా ఉపాధ్యక్షులుగా కొంతం అనిల్, ఫయాజుద్దీన్, జిల్లా కార్యదర్శిగా టంగుటూరి దేవేందర్, జిల్లా కార్యదర్శి వడ్లూరి రమేశ్ను నియమించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు.