● ప్రభుత్వ బడిలో
తన ముగ్గురు పిల్లలకు అడ్మిషన్లు
● ప్రైవేటు పాఠశాలలకు వెళ్లవద్దని
గ్రామ పంచాయతీలో తీర్మానం
లింగంపేట(ఎల్లారెడ్డి): ప్రభుత్వ బడులు.. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోవనే చెబుతూ తన ముగ్గురు పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు ముస్తాపూర్ సర్పంచ్ రాధ. లింగంపేట మండలం ముస్తాపూర్ గ్రామ సర్పంచ్గా రాధ ఇటీవల ఎన్నికయ్యారు. రాధ భర్త కామారెడ్డి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు మండల అభివృద్ధి అధికారి నరేష్ అక్షరాభ్యాసం చేయించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్, న్యాయవాది దంపతులు వారి పిల్లలను చేర్పించడం అభినందనీయమన్నారు. ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే సుమారు 40 మంది పిల్లలు స్థానిక ముస్తాపూర్ ప్రాథమిక పాఠశాలలోనే చేర్పించి సమాజానికి మంచి సందేశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేశారు. గ్రామంలోని విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లవద్దని గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు. దాంతో వార్డు సభ్యుల పిల్లలను సైతం ప్రభుత్వ బడిలో చేర్పించడం విశేషం. అనంతర మండల విద్యాధికారి అంజల్రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ బడుల్లో అనుభవజ్ఞులైన, అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్లు తెలిపారు. కార్పొరేటుకు దీటుగా నాణ్యమైన విద్యను బోధిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంప్లెక్స్ హెచ్ఎం కోటేశ్వర్రావు, హెచ్ఎం సుధాకర్రావు, తదితరులు పాల్గొన్నారు.


