● అదనపు ఎస్పీ నరసింహా రెడ్డి
కామారెడ్డి క్రైం: మహిళలు, చిన్నారులపై జరిగే హింస, వేధింపుల కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం, రక్షణ, వైద్య సహాయం, కౌన్సెలింగ్, పునరావాస సేవలు సమర్థవంతంగా అందించేందుకు సంబంధిత శాఖల మధ్య సమన్వయం ఎంతో కీలకమని అదనపు ఎస్పీ నరసింహా రెడ్డి అన్నారు. కామారెడ్డిలోని జిల్లా భరోసా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మహిళలు, చిన్నారులపై నమోదవుతున్న కేసుల్లో వేగవంతమైన దర్యాప్తుతో పాటు, బాధితులకు అవసరమైన సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య, న్యాయ, కౌన్సెలింగ్, పునరావాస సేవల కల్పనలో పోలీసు శాఖతో పాటు ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు ఒకే వేదికపై అన్ని రకాల సహాయ సేవలు అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. బాధితులు వివిధ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒకే చోట అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఎస్పీ మధుసూదన్, భరోసా కేంద్రం కో–ఆర్డినేటర్ కవిత, డీసీపీవో స్రవంతి, తదితరులున్నారు.


