నందిపేట్ (ఆర్మూర్): ఓ యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై వినయ్ తెలిపారు. నందిపేట్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఆయన వివరాలను వెల్లడించారు. నందిపేట మండలం రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయీమ్ అనే యువకుడిపై మూడు రోజుల క్రితం పాత కక్షల కారణంగా సమీప బంధువులైన ఐదుగురు వ్యక్తులు ఇనుప రాడ్లు, కత్తులతో దాడులు జరిపి హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులైన నందిపేటకు చెందిన షేక్ తాహీర్, షేక్ తాలిబ్, షేక్ గాలిబ్లతో పాటు కామారెడ్డికి చెందిన సయ్యద్ అబ్దుల్ హలీం, ఎస్కే ఫజల్ అనే వ్యక్తులను పట్టుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి వద్దనుంచి నేరానికి ఉపయోగించిన వస్తువులు, రెండు బైకులు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.


