బిచ్కుంద(జుక్కల్) : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)లో ప్రతి ఓటునూ కాపాడుకుందామని, ఏ ఒక్క ఓటరూ తన పేరును జాబితాలో నుంచి కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్లు, నాయకులపై ఉందని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్గుప్తా అన్నారు. బిచ్కుంద బండయప్ప ఫంక్షన్హాల్లో కాంగ్రెస్ బీఎల్ఏలు, నాయకులు, సర్పంచులతో ఎస్ఐఆర్ ఓటరు సవరణ కార్యక్రమంపై శనివారం శిక్షణ నిర్వహించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్గుప్తా, డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఓటును కాపాడుకుందామనే లక్ష్యంతో ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ఇంటింటికి వెళ్లి ఓటరు వివరాలను పరిశీలించాలని కోరారు. ఎస్ఐఆర్ ద్వారా అర్హులైన లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించి బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందిందని ఆరోపించారు. మన రాష్ట్రంలో ప్రారంభం కానున్న ఎస్ఐఆర్లో పోలింగ్ బూత్ ఆఫీసర్ దగ్గర ఉండి అర్హులైన ప్రతి ఓటును మ్యాపింగ్ చేయించాల్సిన బాధ్యత నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లపై ఉందన్నారు. ఓటర్లకు అందుబాటులో ఉంటూ వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలన్నారు. పార్టీ కోసం అంకితభావంతో పని చేసిన బూత్ లెవల్ ఏజెంట్ల సేవలను గుర్తించి భవిష్యత్తులో మంచి పదవులు దక్కేలా తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, మున్సిపల్ చైర్పర్సన్ సీమా షెట్కార్, ఏఎంసీ చైర్మన్లు కవిత, నవీన్, నాగ్నాథ్, విఠల్రెడ్డి, రాంరెడ్డి, సాయాగౌడ్, మాధవరావు దేశాయి, రమేశ్ దేశాయి, మండల అధ్యక్షులు పండరి, సాయిలు, అసద్అలీ, కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియను కాంగ్రెస్ శేణులు ఉద్యమంగా తీసుకోవాలి
ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్గుప్తా
బిచ్కుందలో బీఎల్ఏలకు
అవగాహన సదస్సు


