● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● జిల్లాకేంద్రంలో ఆరోగ్య వారోత్సవాల ర్యాలీ
కామారెడ్డి టౌన్ : ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. ప్రజా పాలన –ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమన్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, ప్రత్యేక వర్గాల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరిశుభ్రత, పౌష్టికాహారం, నివారణాత్మక వైద్యంపై దృష్టి సారిస్తే వ్యాధులను ఆదిలోనే అరికట్టవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిర్ణీత సమయాల్లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రత్యేక క్లినిక్లు ప్రారంభం
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో భాగంగా సంపూర్ణ సురక్ష కేంద్రం, ట్రాన్స్జెండర్స్ క్లినిక్లను కలెక్టర్ ప్రారంభించారు. సమాజంలోని ప్రత్యేక వర్గాలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో రవీందర్ గౌడ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, డీసీహెచ్ఎస్ విజయభాస్కర్రెడ్డి, ఆర్డీవో గిరి, తహసీల్దార్ హిమబిందు, డీపీఆర్వో తిరుమల, ఎంపీడీవో రాణి, రెడ్క్రాస్ సొసైటీ ప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


