
యోగా ప్రదర్శనతో ఆకర్షితులై..
కామారెడ్డి అర్బన్: పాఠశాలలో ఓ ఎన్ఆర్ఐ ఇచ్చిన యోగా ప్రదర్శనను ఆయనను ఆకర్షించింది. ఆ తర్వాత యోగా నేర్చుకుని ఇతరులకు నేర్పుతూ పాతికేళ్లుగా ముందుకు సాగుతున్నారు మూడ బాల్లింగం. ఆయన స్వగ్రామం అప్పట్లో నక్సల్స్ ప్రభావిత గ్రామమైన రామారెడ్డి మండలంలోని మద్దికుంట. ఆరో తరగతి చదువుతున్న రోజుల్లో ఎన్ఆర్ఐ బండి రాములు ఇచ్చిన యోగా ప్రదర్శన ఆయనపై ప్రభావం చూపింది. రాములు వద్ద యోగా నేర్చుకున్నాడు. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతూనే పట్టణంలోని పలు ప్రయివేట్ పాఠశాలల్లో యోగా శిక్షకులుగా పనిచేశారు. స్థానిక ఆయుష్ కేంద్రంలో యోగా శిక్షకులుగా పనిచేస్తున్నారు. సుమారు 25 ఏళ్లుగా ఆయన యోగా గురువుగా సేవలందిస్తున్నారు. యోగాతో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయని బాల్లింగం పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో యోగాను తప్పనిసరి చేస్తే గ్రామీణ విద్యార్థులకు మేలు చేకూరుతుందని, యోగా శిక్షకులకు ఉపాఽధి లభిస్తుందని పేర్కొంటున్నారు.