
ఫోన్ల రికవరీలో జిల్లా ముందంజ
కామారెడ్డి క్రైం: సెల్ఫోన్ల రికవరీలో రాష్ట్రంలోని కమిషనరేట్లను మినహాయించి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సెల్ఫోన్ పోగొట్టుకున్న వారు ఆందోళనకు గురి కావొద్దని, సీఈఐఆర్ విధానంలో రికవరీ చేసే అవకాశం ఉందని తెలిపారు. వారం రోజులుగా జిల్లాలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో పోగొట్టుకున్న, చోరీకి గురైన 110 సెల్ఫోన్లను రికవరీ చేశామని, వాటి విలువ రూ.16 లక్షల వరకు ఉంటుందని వివరించారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 4 వేల వరకు సెల్ఫోన్లను రికవరీ చేశామన్నారు. సెల్ఫోన్ పోగొట్టుకున్న వారు అశ్రద్ధ చేయకుండా తమకు సమాచారం ఇవ్వడంతోపాటు భద్రతా కారణాల దృష్ట్యా వెంటనే సిమ్ కార్డును బ్లాక్ చేయించాలని సూచించారు. ఆలస్యం చేస్తే వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలిగే అవకాశం ఉంటుందన్నారు. ఫోన్ల రికవరీలో ప్రతిభ కనబర్చిన ప్రత్యేక బృందం సభ్యులను అభినందించారు. ఫోన్లు పోగొట్టుకుని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన వారు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఆర్ఎస్సై బాల్రాజు (87126 86114)ను సంప్రదించి తీసుకువెళ్లాలని సూచించారు. ఏఎస్పీ నరసింహారెడ్డి, ఏఆర్ డీఎస్పీ యాకూబ్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
స్పెషల్ డ్రైవ్ ద్వారా
110 సెల్ఫోన్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్చంద్ర