
డ్రంకెన్డ్రైవ్ కేసులో ఒకరికి జైలు
బోధన్: ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో ఈనెల 13న పోలీసులు డ్రంకెన్డ్రైవ్ తనికీలు చేపట్టగా నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. పోలీసులు అతడిని గురువారం బోధన్ కోర్టులో హాజరుపర్చగా జడ్జి రెండు రోజుల జైలు శిక్ష విధించారని ఎడపల్లి ఎస్సై వంశీ కృష్ణారెడ్డి తెలిపారు.
మహిళను తోసివేసిన వ్యక్తిపై ఫిర్యాదు
ఖలీల్వాడి: నగరంలోని బురడిగల్లీలో ఎదురెదురుగా ఉన్న మహిళలు గొడవ పడినట్లు ఎస్సై సయ్యద్ ఇమ్రాన్ శుక్రవారం తెలిపారు. ఎదురెదురుగా ఉండే తల్లికూతుళ్లతో మరో మహిళ గొడవ పడినట్లు తెలిపారు. సదరు మహిళ భర్త వచ్చి తల్లీకూతుళ్లను నెట్టివేయడంతో వారికి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కరెంట్ షాక్తో ఎద్దు మృతి
లింగంపేట: మండలంలోని అయిలాపూర్ గ్రామంలో బీరప్ప అనే రైతుకు చెందిన ఎద్దు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందింది. గ్రామ శివారులోని పొలంలో గురువారం మేత కోసం వెళ్లిన ఎద్దుకు ట్రాన్స్ఫార్మర్ వద్ద కరెంటు షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఎద్దు విలువ రూ. 70వేలు వరకు ఉంటుందని బాదితుడు తెలిపారు. ఘటన స్థలాన్ని ట్రాన్స్కో అధికారులు పరిశీలించారు. అధికారులు స్పందించి నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని బాధితుడు కోరాడు.