
ఫిర్యాదుదారులతో బాధ్యతగా వ్యవహరించాలి
ఎస్పీ రాజేష్ చంద్ర
నిజాంసాగర్(జుక్కల్): ఫిర్యాదుదారులతో బాధ్యతగా వ్యవహరించాలని, ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీస్ విధులు ఉండాలని ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర సూచించారు. గురువారం వార్షిక తనిఖీలో భాగంగా జుక్కల్ పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా భరోసా కల్పించాలని, బాధితులకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ని సంప్రదించవచ్చని అన్నారు. నేరాల నివారణే లక్ష్యంగా పని చేయాలని స్థానిక పోలీసులకు సూచించారు. విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి పెడుతూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నూతన టెక్నాలజీపై పోలీసులు అవగాహన పెంచుకోవాలన్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. జుక్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని బ్యాంకులు, మందిరాలు, దేవాలయాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు, అలారంలు ఏర్పాటు చేయాలని ఎస్సైని ఆదేశించారు. పెండింగ్ కేసులపై రివ్యూ చేశారు. డీఎస్పీ విఠల్ రెడ్డి, బిచ్కుంద సీఐ నరేష్, జుక్కల్ ఎస్సై భువనేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.