
వైద్యాధికారిపై దాడికి నిరసనగా ధర్నా
రామారెడ్డి: కామారెడ్డిలోని కల్కినగర్లో నివాసం ఉంటున్న రామారెడ్డి ప్రభుత్వ వైద్యాధికారి సురేష్ ఇంటికి ఈ నెల 17న రాత్రి వెళ్లి దాడి చేసిన దేవునిపల్లి పీహెచ్సీ డాటా ఎంట్రీ ఆపరేటర్(డీఈవో) రాజును సస్పెండ్ చేయాలని వైద్య సిబ్బంది గురువారం రామారెడ్డిలో ధర్నాకు దిగారు. వైద్య సిబ్బంది మాట్లాడుతూ.. దాడిలో రాజుతో పాటు జుక్కల్ ప్రభుత్వ ఆస్పత్రి జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించే సుభాష్ ఇద్దరూ కలిసి పాల్గొన్నారని, అసభ్యకర పదజాలంతో తిడుతూ దాడి చేసినట్లు తెలిపారు. దాడి చేసిన సమయంలో 100కు డయల్ చేస్తే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు స్పందించలేదని ఆరోపించారు. ఈ దాడిలో డాక్టర్ సురేష్కు స్వల్పంగా గాయాలయ్యాయని చెప్పారు. జిల్లా వైద్యాధికారులు, పోలీస్ అధికారులు, కలెక్టర్ స్పందించి దాడి చేసిన ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుండా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తామన్నారు. ఈ దాడిని రామారెడ్డి , ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల సిబ్బంది ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.