
అప్రమత్తతే రక్ష..!
బీబీపేట: వర్షాకాలం వచ్చిందంటే చాలు విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరుగతుంటాయి. వర్షాకాలంలో ప్రజలు, రైతులు విద్యుత్తో అప్రమత్తంగా ఉండకపోవడంతో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇళ్లు, పంట చేల వద్ద విద్యుత్ వినియోగంలో ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించినప్పటికీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం వ ర్షాకాలం సీజన్లో విద్యుత్తో బోరు బావులు, వా గుల వద్ద విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి పంటలు సాగు చేస్తారు. ఈ సమయంలో మోటార్ల వినియోగంలో రైతులు జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం బారి న పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది.
పొలాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
● పంట పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద రైతులు చిన్న, చిన్న మరమ్మతులు చేస్తుంటారు. దీంతో ప్రమాదాలు జరుగుతుంటాయి.
● ట్రాన్స్ఫార్మర్ ఏబీ స్విచ్ పూర్తిగా నిలిచిపోకపోతే విద్యుత్ సరఫరా అయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేయాల్సి వస్తే విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలి.
● ఇక విద్యుత్ మోటార్లు వాడే సమయంలో జాగ్రత్తలు అవసరం. ఒక ఫేజ్ కాలితే మోటార్ మొత్తానికి విద్యుత్ ప్రవహిస్తుంది. కాబట్టి ఆ సమయంలో మోటారుకు తగలకూడదు. మోటార్ పని చేయని సమయాల్లో చేతితో దానిని తాకకూడదు.
● టెస్టర్ ఉపయోగించి మాత్రమే మోటార్ను పరీక్షించాలి. ఎర్తింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. మోటార్పై రేకును అమర్చాలి. వర్షం పడితే తడవకుండా కాపాడుకోవాలి.
● అంతే కాకుండా పంట పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, స్లాటర్ బాక్స్ల చుట్టూ పిచ్చి మొక్కలు ఉండకుండా చూసుకోవాలి. వర్షాకాలం కాబట్టి వాటి చుట్టున్న మొక్కలులాంటివి ఉండడంతో విద్యుత్ సరఫరా అయి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
● స్టార్టర్లకు రక్షణగా ఉండేందుకు కవర్లను ఉంచుకోవాలి. తెగిన విద్యుత్ తీగలతో జాగ్రత్తగా ఉండాలి. సర్వీసు తీగ తెగినప్పుడు గుడ్డ ముక్క తో అతికిస్తారు. ఇది చాలా ప్రమాదకరం. వీలైనంత వరకు తెగని తీగలను మాత్రమే వాడాలి.
● విద్యుత్ మోటార్ల వద్ద కింద పడి ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా ఉండకూడదు. తీగ ఎక్కడ చిన్నగా తెగినా నడిచేప్పుడు కాని స్విచ్ ఆన్ చేసే సమయంలో తగిలితే ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి.
● బోరుబావుల వద్ద పైపులు పైకి తీసే క్రమంలో పైన విద్యుత్ వైర్లు ఉన్నది గమనించకపోవడంతో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అలా వైర్లు ఉన్నట్లయితే విద్యుత్ బంద్ చేసిన తర్వాతనే పైపులు తీయాలి.
విద్యుత్ అధికారుల అవగాహన
విద్యుత్ శాఖ అధ్వర్యంలో పొలం బాట కార్యక్రమం పేరిట ప్రతి గ్రామంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతుల పొలం వద్దకే వెళ్లి రైతులకు విద్యుత్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన కల్పిస్తూ పలు సలహాలు ఇస్తున్నారు. అంతే కాకుండా విద్యుత్ సమస్య తలెత్తినప్పుడు కచ్చితంగా విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలుపుతున్నారు.
వర్షాకాలంలో అధికంగా
విద్యుత్ ప్రమాదాలు
చిన్న పొరపాటుతో ప్రాణాలు
పోగొట్టుకుంటున్న రైతన్నలు
అవగాహన లోపంతో గాల్లో
కలుస్తున్న ప్రాణాలు
జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి
వర్షాకాలంలో ఇళ్లలో విద్యుత్తో జాగ్రత్తగా ఉండాలి. తడి చేతులతో విద్యుత్ పరికరాలను స్విచ్లను తాకకూడదు. ఇక పంట పొలాల వద్ద రైతులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్టార్టర్ బాక్సులు, విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు పాటించాలి. విద్యుత్ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే స్వంతంగా మరమ్మతులు చేయకూడదు. సంబంధిత లైన్మన్ లేదా విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలి.
– సుదర్శన్రెడ్డి, ఏడీఈ, దోమకొండ

అప్రమత్తతే రక్ష..!

అప్రమత్తతే రక్ష..!