
ఎన్పీఏ తగ్గింపునకు మరింత కృషి చేయాలి
సుభాష్నగర్ : బ్యాంకు నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) తగ్గింపునకు మరింత కృషి చేయాలని ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. నగరంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ రమేశ్ రెడ్డి శాఖ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్రాంచీల వారీగా పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం (2024–25) ఫలితాలు అందరి కృషికి నిదర్శనమన్నారు. రాష్ట్రస్థాయిలో ఎన్డీసీసీబీ అన్నిరంగాల్లో వెనకబడిపోయిందనే పేరు ఉందని, ప్రస్తుత ఫలితాలతో ఆ పేరు తొలగిపోయిందని హర్షం వ్యక్తంచేశారు. ఎన్పీఏను గణనీయంగా తగ్గించేందుకు శాఖ అధికారులు, సిబ్బంది అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రతి ఉద్యోగి తనకు తానుగా లక్ష్యాన్ని ఏర్పర్చుకొని ఆ దిశగా ప్రయత్నం చేయాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఇవే ఫలితాలు పునరావృతం కావాలని ఆశాభావం వ్యక్తంచేశారు. తద్వారా బ్యాంకు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంటూ రాష్ట్రస్థాయిలో పూర్వవైభవాన్ని, శోభను కీర్తిస్తుందని తెలిపారు. ఇంతటి ఘనతను విశేషంగా కృషి చేసి, రోజూవారీ కార్యక్రమాల్లో మార్గనిర్దేశం చేసిన ఉన్నతాధికారులను అభినందించి, సీఈవో నాగభూషణం వందే, ఎస్సీడీఆర్ వసంతను శాలువాతో సన్మానించారు. వివిధ విభాగాలు (గృహతార, స్వర్ణరత్న, రికవరీ చాంపియన్)లో ఉత్తమ ప్రతిభ చూపిన శాఖాధికారులకు జ్ఞాపికతోపాటు నగదు బహుమతి అందజేశారు. సమావేశంలో సీనియర్ బ్యాంకు అధికారులు లింబాద్రి, గజానంద్, అనుపమ, సుమమాల, 63 శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి
బ్యాంకు సిబ్బందికి అభినందనలు