
‘బ్యాంకు రుణాలు ఇప్పించాలి’
కామారెడ్డి టౌన్: అధిక వడ్డీల భారంనుంచి రైతులను తప్పించడానికి బ్యాంకుల ద్వారా రుణాలు పొందేలా చూడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.నాగరాణి వ్యవసాయ అధికారులకు సూచించారు. బుధవారం చిన్నమల్లారెడ్డి రైతు వేదికలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, వ్యవసాయ శాఖలు కలిసి బ్యాంక్ అధికారులతో రైతులకు రుణాల మార్పిడి, మంజూరుపై న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ అవగాహన లోపంతో రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేస్తున్నారన్నారు. దీనివల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొని ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతులు బ్యాంకుల్లో రుణాలు పొందడానికి వ్యవసాయ అధికారులు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూపరింటెండెంట్ చంద్రసేన్రెడ్డి, ఏడీఏ అపర్ణ, ఏవోలు, ఏఈలు, బ్యాంక్ అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.