
ప్రభుత్వ పాఠశాలల్లో మెరిసి..
దోమకొండ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పేదరికంలో పెరిగి ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించి నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు దోమకొండ మండల కేంద్రానికి చెందిన పలువురు యువతీ యువకులు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల, బాలుర పాఠశాలల్లో వీరు చదివారు. బీడీ కార్మిక కుటుంబాల నుంచి స్కాలర్షిప్ల సాయంతో చదువులు కొనసాగించారు. చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించారు. పదవ తరగతితో పాటు ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో వీరు విద్యనభ్యసించి మంచి ప్రతిభ చూపారు. వీరి ప్రతిభను గుర్తించిన హైద్రాబాద్కు చెందిన లైఫ్ ఎన్జీవో సంస్థ స్కాలర్షిఫ్ అందించి డిగ్రీ అనంతరం వీరికి సంస్థ ఆద్వర్యంలో ఉచిత శిక్షణ ఇచ్చారు. అనంతరం వీరు పలు ఇంటర్వ్యూలకు హాజరు కాగా, డిగ్రీ చదువుతో కార్పొరేట్ కంపెనీల్లో మండలానికి చెందిన పలువురు యువతీ యువకులు ఉద్యోగాలు సాఽధించారు. బీడీ కార్మిక, నిరుపేద కుటుంబాలకు చెందిన వీరు కార్పొరేట్ సంస్థలో ఉద్యోగాలు సాధించి పుట్టిన ఊరితో పాటు పలువురికి ఆదర్శంగా నిలిచారు. హైబ్రాబాద్లో లైఫ్ ఎన్జీవో సంస్థను దోమకొండకు చెందిన దేవరగట్టు బాలప్రసాద్ నిర్వహిస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన, ప్రతిభ ఉన్న యువతీ యవకులకు ఉచిత శిక్షణ ఇచ్చి కార్పొరేట్ కంపెనీలకు ఇంటర్వ్యూలకు పంపిస్తారు. బాల ప్రసాద్ తన మిత్రులతో కలిసి లైఫ్ ఎన్జీవో సంస్థను 2017 ఏర్పాటు చేశారు. ప్రతిభ ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి స్కాలర్షిప్ను సైతం అందిస్తూ ప్రోత్సహించి డిగ్రీ అనంతరం శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాల్లో అండగా నిలుస్తున్నారు.
కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు
సాధిస్తున్న ప్రభుత్వ పాఠశాల
విద్యార్థినులు
నేటి యువతకు ఆదర్శంగా
నిలుస్తున్న వైనం
లైఫ్ ఎన్జీవో సంస్థ ద్వారా
ఉచిత శిక్షణ