
‘కొత్త పెన్షన్ చట్టాన్ని వ్యతిరేకించాలి’
కామారెడ్డి అర్బన్: పార్లమెంట్ ఆమోదంతో ముందుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ కొత్త పెన్షన్ చట్టం పెన్షనర్ల జీవితాలపై ఆశనిపాతం కానున్నందున.. దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర సలహాదారుడు జి.లచ్చయ్య పిలుపునిచ్చారు. బుధవారం అసోసియేషన్ జిల్లా సమావేశం స్థానిక కర్షక్ బీఎడ్ కళాశాలలో జరిగింది. లచ్చయ్య మాట్లాడుతూ..నూతన పెన్షన్ వచ్చే జనవరి 1 నుంచి రిటైర్డ్ అయ్యే వారికి వర్తిస్తుందన్నారు. కొత్త చట్టం అమలు నిలిపివేయాలని దేశ వ్యాప్తంగా సంతకాల ఉద్యమం చేపట్టి ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేయనున్నట్టు పేర్కొన్నారు. అనంతరం పెన్షన్ వివరాల కరపత్రాలను అందించారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయరామరాజు, ఉపాధ్యక్షులు శంకరయ్య, ప్రతినిధులు రవీందర్, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.