
కరెంట్ షాక్తో ఒకరి మృతి
ఇందల్వాయి: కోతులను తరిమే క్రమంలో విద్యుత్ తీగలు తగిలి ఒకరు మృతి చెందిన ఘటన మండలంలోని గంగారాం తండాలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్ నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన భగవాన్లాల్ గంగారం తండాలో అద్దె ఇంట్లో ఉంటూ ఐస్క్రీమ్ తయారు చేసి గ్రామాల్లో విక్రయించేవాడు. బుధవారం ఐస్క్రీమ్లు తయారు చేస్తుండగా కోతులు గుంపుగా రావడంతో ఐరన్ పైప్ తీసుకొని బిల్డింగ్ పైకి వాటిని తరిమే క్రమంలో పైపు 11 కేవీ విద్యుత్ తీగలకు తగలడంతో భగవాన్లాల్ అక్కడిక్కకడే మృతి చెందాడు. భార్య మంజులా దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పిచ్చికుక్కల దాడి..
13 మందికి గాయాలు
ధర్పల్లి: ధర్పల్లి మండల కేంద్రంతోపాటు దమ్మన్నపేట గ్రామంలో బుధవారం పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. రెండు గ్రామాల్లో కనిపించిన వారిని కనిపించినట్లే కరుస్తూ వెళ్లాయి. పిచ్చికుక్కల దాడిలో 13 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులకు ధర్పల్లి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. దమ్మన్నపేటలో ఇద్దరు చిన్నారుల ముఖంపై తీవ్రగాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అధికారులు స్పందించి గ్రామాల్లో పిచ్చికుక్కల బెడదను అరికట్టాలని గ్రామస్తులు కోరారు.