
విజయాలు
ఏడాదిలో ఎన్నో
కలెక్టర్గా తన మార్క్ చూపిస్తున్న ఆశిష్ సంగ్వాన్ ప్రజావాణి కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు వినతులపై ఎప్పటికప్పుడు సమీక్ష, సమస్యల పరిష్కారానికి చొరవ విధుల్లో నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు వివిధ రంగాల్లో ముందంజలో జిల్లా
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి కలెక్టర్గా ఆశిష్ సంగ్వాన్ బాధ్యతలు చేపట్టి సోమవారంతో ఏడాది పూర్తవుతోంది. ఏడాది కాలంలో ఆయన జిల్లాపై తనదైన ముద్ర వేశారు. బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే జిల్లా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. విధులలో నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలకూ వెనుకాడకుండా పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. రోజూ ఏదో ఒక ప్రాంతాన్ని చుట్టేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయడం ద్వారా ఆయా వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వివిధ రంగాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపడంలో ఆయన కృషి ఎంతో ఉంది.
ఆశిష్ సంగ్వాన్ గతేడాది జూన్ 16న కామారెడ్డి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన తొలి రోజే అధికారులతో వివిధ అంశాలపై సమీక్షలు చేసి అన్నింటా ముందుండేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ దూకుడును గమనించిన అధికారులు, ఉద్యోగులు చాలా మంది బాధ్యతగా పనిచేయడం అలవాటు చేసుకున్నారు. పెండింగ్లో ఉన్న వేలాది ధరణి ఫైల్స్ను పరిష్కరించేందుకు కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతిని తీసుకువచ్చి పైలట్ ప్రాజెక్టుగా లింగంపేట మండలాన్ని ఎంపిక చేయగా.. అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించి రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు మొదలుపెట్టారు. అప్పటికప్పుడు కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి. ఇంకా చాలా సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. అలాగే భూభారతిని అన్ని మండలాలకు విస్తరించే క్రమంలో ఆయా మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు.
ప్రజావాణికి ప్రాధాన్యత
తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు తరలివస్తారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను ఆలకించేందుకు కలెక్టర్ దాదాపు ప్రతి వారం అందుబాటులో ఉంటున్నారు. స్వయంగా దరఖాస్తుదారులతో మాట్లాడి వారి సమస్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మండల స్థాయిలో పరిష్కారం అయ్యే కొన్ని సమస్యలను అక్కడికక్కడే జూమ్ మీటింగ్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు. ప్రజావాణికి ఆయా శాఖల జిల్లా అధికారులు తప్పనిసరి హాజరవుతున్నారు. దీంతో అదే రోజు సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు.
బయోమెట్రిక్తో సమయపాలన
కలెక్టరేట్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయడంతో ఉద్యోగులు తప్పనిసరిగా సమయపాలన పాటిస్తున్నారు. వేలిముద్ర వేయడంలో ఆలస్యమైతే దానిపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకునేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో అధికారులు, ఉద్యోగులు ఎవరైనా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో పలువురు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు.
బడికో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ నియామకం
పాఠశాలల్లో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు పెరిగిన నేపథ్యంలో కలెక్టర్ సంగ్వాన్ ప్రతి పాఠశాలలో ఒక టీచర్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా నియమించారు. విద్యార్థులు వేధింపులకు గురికాకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చారు. అన్ని పాఠశాలల్లో నియమించి పర్యవేక్షించారు.
వేగంగా సామాజిక కులగణన
రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ, ఆర్థిక, సామాజిక కులగణన చేపట్టిన సందర్భంలో కామారెడ్డి జిల్లాలో గణన వేగంగా జరిగింది. రాష్ట్ర స్థాయిలో కామారెడ్డి జిల్లాకు గుర్తింపు లభించింది. కలెక్టర్ సంగ్వాన్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహించి సర్వే పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో వేసవి సీజన్లో తాగునీటి సమస్య పరిష్కారానికి అనేక చర్యలు తీసుకున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి అధికారులను పంపించి వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారు.
విద్య, వైద్యంపై ఫోకస్
జిల్లాలో విద్య, వైద్యం మెరుగుపడేలా అనేక చర్యలు తీసుకున్నారు. క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లినపుడు ఆయా ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆస్పత్రులను తనిఖీ చేయడం ద్వారా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇంటర్, టెన్త్ రిజల్ట్స్పై అధికారులతో రివ్యూ చేసి మెరుగైన ఫలితాలు సాధించాలని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఆస్పత్రులు, పీహెచ్సీలలో సమస్యలపై చర్యలు తీసుకున్నారు.
రక్తదాన కార్యక్రమాల్లో అగ్రభాగం
ఆపదలో ఉన్న వ్యక్తులకు అవసరమైన రక్తం సేకరించేందుకు రెడ్క్రాస్ సొసైటీ ద్వారా పెద్ద సంఖ్యలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఇటీవల గవర్నర్ చేతుల మీదుగా కలెక్టర్ సంగ్వాన్ బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డును అందుకున్నారు. రక్తదాతలను ప్రోత్సహించడం, ఎక్కువ మొత్తంలో రక్తం సేకరించడం ద్వారా జిల్లా ముందు వరుసలో నిలిచింది.
పలు అంశాల్లో ప్రగతి
రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. వరుసగా రెండు పంటలకు సంబంధించి కొనుగోళ్లలో ఈ ఘనత సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల విషయంలోనూ కలెక్టర్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ పనుల్లో వేగం పెరిగేలా చూస్తున్నారు.
పత్రికా కథనాలపై స్పందన
అవినీతి, అక్రమాలు, సమస్యలపై పత్రికల్లో వ చ్చే కథనాలపై కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిరోజూ పత్రికల్లో వచ్చే కథనాలపై కలెక్టర్ స్పందిస్తూ వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. పెండింగ్లో ఉన్న వాటిపైనా సమీక్షిస్తున్నారు. ఈ సమీక్షలో ఎందుకు సమస్యలు పరిష్కారం కాలేదో అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. రెగ్యులర్గా కొనసాగుతోంది.

విజయాలు