
రాజీయే రాజమార్గం
● కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్
కామారెడ్డి టౌన్: రాజీయే రాజమార్గమని, కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశం కల్పిస్తోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సీహెచ్. వీఆర్ఆర్ వరప్రసాద్ పేర్కొన్నారు. శనివారం జిల్లావ్యాప్తంగా జాతీయ లోక్అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డిలోని జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ కేసు పరిష్కారమై అవార్డు పాస్ చేస్తే అది అంతిమ తీర్పు అవుతుందన్నారు.
చీటింగ్ కేసులు, సైబర్ కేసులు, బ్యాంకు ప్రీ లిటిగేషన్ కేసులు, చెక్ బౌన్స్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ముఖ్యంగా భార్యాభర్తల కేసులు కూడా పరిష్కరిస్తామన్నారు. వీలైనన్ని ఎక్కువ కేసులను పరిష్కరించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి టి.నాగరాణి పోలీసులు, న్యాయవాదులకు సూచించారు. పోలీస్ శాఖ తరఫున పూర్తిగా సహాయ సహకారాలు ఉంటాయని జిల్లా అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి పేర్కొన్నారు.
జిల్లాలో 1,840 కేసుల పరిష్కారం
జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 1,840 కేసులను పరిష్కరించారు. ఇందులో 1,751 క్రిమినల్ కేసులు, రెండు సివిల్, 15 మోటర్ యాక్సిడెంట్స్ క్లయిమ్స్ ట్రిబ్యునల్(ఎంఏసీటీ) కేసులు, 37 సైబర్ క్రైం కేసులు, 35 ప్రీ లిటిగేషన్ బ్యాంక్ కేసులున్నాయి. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఈట సుమలత, జూనియర్ సివిల్ జడ్జి సుధాకర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి దీక్ష, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేశ్, పీపీలు రాజగోపాల్ గౌడ్ , దామోదర్రెడ్డి, సూర్య ప్రకాశ్, సీఐలు చంద్రశేఖర్రెడ్డి, సంపత్, న్యాయవాదులు శంకర్రెడ్డి, దేవరాజ్గౌడ్, శ్రీధర్, శ్యామ్గోపాల్రావు, న్యాయ శాఖ సిబ్బంది భుజంగ్రావు, శ్రీధర్, చంద్రసేన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మృతుడి కుటుంబానికి రూ. 1.40 కోట్ల పరిహారం
తాడ్వాయి సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగి తల్లపల్లి శ్రీనివాస్గౌడ్ కుటుంబానికి రూ. 1.40 కోట్ల చెక్కును అందజేశారు. మృతుడి కుటుంబసభ్యులు పరిహారం కోసం ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్లగా.. వారు క్లయిమ్ ఇవ్వకపోవడంతో వివాదం నడిచింది. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీ సహా ప్రతివాదులపై కోర్టులో క్లయిమ్ దాఖలు చేశారు. శనివారం జరిగిన లోక్ అదాలత్లో ఈ కేసును రాజీ కుదిర్చి, మృతుడి కుటుంబ సభ్యులకు ఇన్సురెన్స్ కంపెనీ నుంచి మంజూరైన చెక్కును అందించారు.