
పండ్ల తోటల పెంపకంపై అనాసక్తి
బాన్సువాడ రూరల్: పండ్ల తోటల సాగును పెంచేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తున్నా రైతులు మాత్రం ఆసక్తి చూపడం లేదు. సంప్రదాయ పంటల సాగుకే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది సుమారు 400 ఎకరాల్లో పండ్ల తోటలు పెంచాలని సీఆర్డీ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి అనుగుణంగా జిల్లా అధికారులు ఉపాధి హామీలో భాగంగా 22 మండలాలకు లక్ష్యాన్ని కేటాయించి ఆసక్తిగల రైతులతో పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టాలని ఆదేశించారు. దీంతో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఉపాధి హామీ సిబ్బంది, మండల అధికారులు ఆసక్తి ఉన్న సన్న, చిన్న కారు రైతులు ఉద్యాన, పండ్లతోటలు సాగు చేసేందుకు ముందుకు వస్తే అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తామని సూచించారు. ఉద్యానవన పంటల సాగులో మామిడి, బత్తాయి, నారింజ, జామ, సీతాఫలం, డ్రాగన్ప్రూట్, సపోట, కొబ్బరి, దానిమ్మ, మునగ, ఆయిల్పామ్ వంటి వాటిని రైతులు తమ భూముల పరిస్థితికి అనుగుణంగా ఎంపిక చేసుకునే అవకాశం ఉందని అవగాహన కల్పించారు. ముందస్తుగా బిందు సేద్యానికి దరఖాస్తు చేసుకుంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా 90 శాతం రాయితీపై పరికరాలు అందిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో 215 మంది రైతులనుంచి 296 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకానికి దరఖాస్తులు స్వీకరించారు. అయితే 13 మంది రైతులకు చెందిన 13 ఎకరాలకు మాత్రమే ఎస్టిమేషన్ జనరేట్ అయ్యింది. ఇందులోనూ ఇద్దరు రైతులు మాత్రమే మొక్కలు నాటడానికి గుంతలు తీయడం గమనార్హం. పండ్ల తోటల పెంపకంపై ఆసక్తి లేకపోవడంతో రైతులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
ముందుకు రాని రైతులు
సంప్రదాయ పంటల
సాగుకే మొగ్గు
రైతులు ముందుకు రావాలి
పండ్లతోటల పెంపకానికి రైతులు ముందుకు రావాలి. ఉద్యానవన పంటల సాగుతో రైతులు మెరుగైన లాభాలు సాధించవచ్చు. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకుంటే సంబంధిత శాఖ అధికారులు అన్ని విధాలుగా సహకరిస్తారు. టార్గెట్ను పూర్తిచేయడానికి కృషి చేస్తున్నాం.
– ముజాహిద్, ఎంపీడీవో, బాన్సువాడ

పండ్ల తోటల పెంపకంపై అనాసక్తి