
బీబీపేట బాలికల పాఠశాల బాలుర పాఠశాలకు బదిలీ
బీబీపేట: అరవై ఏళ్ల చరిత్ర కలిగిన బీబీపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను బాలుర పాఠశాలకు బదిలీ చేశారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల 1965లో ప్రారంభించబడింది. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.
ఉత్తర్వులు జారీ..
బీబీపేటలో గత మూడేళ్ల క్రితం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభించడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు బాలుర ఉన్నత పాఠశాలలో కళాశాల కొనసాగింది. అయితే ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు పాఠశాల విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయనే ఉద్దేశ్యంతో అందులో నుంచి కళాశాలను ప్రస్తుతం బాలికల పాఠశాలకు తాత్కాలికంగా మారుస్తూ గురువారం డీఈవో రాజు ఉత్తర్వులు జారీ చేశారు. బాలికల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులను బాలుర పాఠశాలకు వెళ్లాలని ఉత్తర్వుల్లో సూచించారు.
ఆందోళనకు సిద్ధమైన
విద్యార్థుల తల్లిదండ్రులు
మండలంలో కేవలం ఒకటే బాలికల పాఠశాల ఉండడంతో దానిని బాలుర పాఠశాలకు మార్చడంపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు సిద్దమవుతున్నారు. తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యాచరణకు సిద్ధమవుతున్నారు.
పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని ధర్నా
మండల కేంద్రంలో ఉన్న పభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ విద్యార్థినుల తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. శుక్రవారం స్థానిక పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. బాలికల పాఠశాలను ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కేటాయించడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ప్రధాన రోడ్డుపై బైఠాయించి రెండు గంటల పాటు నిరసన తెలిపారు. ఉన్నత విద్యాశాఖ అఽధికారులు స్పందించి పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
జూనియర్ కళాశాల కోసం
బాలికల పాఠశాల కేటాయింపు
వ్యతిరేకంగా కార్యాచరణకు
సిద్ధమవుతున్న తల్లిదండ్రులు