
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనను కృషిచేయాలి
బాన్సువాడ రూరల్: బడీడు పిల్లలను బడిలో చేర్పించడం ద్వారా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఏఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అయ్యాల సంతోష్రావు అన్నారు. అంతర్జాతీయ బాలకార్మిక నిర్మూలన దినోత్సవం సందర్బంగా గురువారం ఆయన రాజారాం దుబ్బలోని నిరుపేద కుటుంబాలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల సౌకరర్యాలను సద్వినియోగం చేసుకుంటూ పిల్లలకు విద్య అందించాలని వారికి సూచించారు.
ఆటో బోల్తా.. పలువురికి గాయాలు
గాంధారి(ఎల్లారెడ్డి): అదుపు తప్పి ఆటో బోల్తా పడడంతో ఒకే కుటుంబానికి చెందిన పలువురికి గాయాలైన ఘటన మండల పరిధిలోని మేడిపల్లి సమీపంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు, అంబులెన్సు సిబ్బంది ఈఎంటీ సురేశ్, పైలట్ ప్రకాశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారి మండల కేంద్రానికి చెందిన ఆరిఫ్ కుటుంబసభ్యులతో బడాపహాడ్ దర్శనం కోసం ఆటోలో బయల్దేరారు. గాంధారి– బాన్సువాడ ప్రధాన రహదారిలో బుగ్గగండి ప్రాంతంలో ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన లోయలో పడిపోయింది. దీంతో ఆటో నడుపుతున్న ఆరిఫ్తోపాటు అందులో ప్రయాణిస్తున్న మహిళలు, పిల్లలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు, గండివేట్ మాజీ సర్పంచ్ ఫారూఖ్ 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను లోయలో నుంచి పైకి తీసుకొచ్చి అంబులెన్సులో ఎక్కించారు. ఆరిఫ్తోపాటు చిన్నారులు అమ్రాన్, అర్ఫాన్, షరీనా, షాబీనాకు తీవ్రగాయాలు కాగా మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయం చేసిన మాజీ సర్పంచ్ ఫారూఖ్ను పలువురు అభినందించారు.