కామారెడ్డి క్రైం: జిల్లా పోలీసు శాఖలో బదిలీల ప్రక్రియ ముగిసింది. జిల్లాలోని మూడు పోలీసు సబ్ డివిజన్ల పరిధిలో పని చేస్తున్న సివిల్ హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్సైల బదిలీలను జిల్లా పోలీసు కార్యాలయంలో నాలుగు రోజులపాటు చేపట్టారు. గురువారం నిర్వహించిన సమావేశంలో ఎస్పీ రాజేశ్చంద్ర మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల సర్వీస్ పూర్తిచేసిన హెడ్ కానిస్టేబుళ్లు, మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఏఎస్సైల బదిలీల్లో భాగంగా విల్లింగ్ స్టేషన్లు, సీనియారిటీ, దంపతుల సేవలు (స్పౌస్), ఆరోగ్య పరిస్థితులు, సర్వీస్ రికార్డులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. ప్రతి పోలీసు అధికారి క్రమశిక్షణతో మెలగాలని, నిబద్ధత, నిజాయితీతో వ్యవహరించాలని సూచించారు. ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. అప్పుడే పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం బలపడుతుందని పేర్కొన్నారు. అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, ఏఆర్ డీఎస్పీ యాకూబ్రెడ్డి, ఎస్బీ సీఐ తిరుపయ్య, ఆర్ఐలు నవీన్కుమార్, కృష్ణ, అధికారులు పాల్గొన్నారు.
క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలన్న ఎస్పీ రాజేశ్చంద్ర