
బాధ్యతతో పని చేయాలి
బాన్సువాడ : మున్సిపాలిటీ పరిధిలోని వార్డు ఆఫీసర్లు, వార్డు ఇన్చార్జీలు బాధ్యతతో పని చేయాలని, వార్డుల్లో పర్యటిస్తూ ఇందిరమ్మ ఇళ్ల పనులు పురోగతిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ గురువారం సమీక్షాసమావేశం నిర్వహించి వార్డుల వారీగా ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. పోచారం శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్ నుంచి ఫోన్లో అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో మాట్లాడారు. బాన్సువాడ పట్టణానికి మొదటి విడతలో 260 ఇందిరమ్మ ఇళ్లు మంజురయ్యాయని, వార్డుల వారీగా ఏ వార్డులో ఎన్ని ప్రారంభించారో, ఎన్ని బెస్మిట్ వరకు వచ్చాయనే విషయాలు వార్డు ఆఫీసర్లు, ఇన్చార్జీలకు తెలుసని, ప్రతి ఒక్క లబ్ధిదారుని కలిసి ఇల్లు నిర్మించుకునేలా ప్రొత్సాహించాలని అన్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఇసుక రాష్ట్రంలోనే మన నియోజకవర్గంలో అతి తక్కువ ధరకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గంలోని బీర్కూర్, కిష్టాపూర్, చించోల్లి, దామరంచ క్వారీల్లో ఇసుక అందుబాటులో ఉందని, ఒక్క ఇంటి నిర్మాణానికి 20 ట్రాక్టర్ల ఇసుక అవసరమవుతుందని, వర్షాకాలం దృష్ట్యా సరిపడా ఇసుకను సొంత స్థలాల్లో డంపు చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు బాన్సువాడ పట్టణంలో 2500 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇచ్చామని, ఇప్పుడు ఇందిరమ్మ పథకం ద్వారా స్థలం ఉన్న వారికి 260 ఇళ్లు మంజురు చేశామని, స్థలాలు లేని వారి వివరాలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలో మంజురయ్యేలా చూస్తానని పోచారం అన్నారు. రెండు, మూడు రోజుల్లో బాన్సువాడకు వచ్చి వార్డు ఆఫీసర్లు, ఇన్చార్జీల పనితీరును పర్యవేక్షిస్తానని అన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగాధర్, కమిషనర్ శ్రీహరిరాజు, నాయకులు కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, ఎజాస్, అసద్, సురేశ్, నార్ల రవీందర్, మాసాని శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు
పురోగతిలో ఉండాలి
వార్డు ఆఫీసర్లు, ఇన్చార్జీలు
వార్డుల్లో పర్యటించాలి
వ్యవసాయ సలహాదారు
పోచారం శ్రీనివాస్రెడ్డి

బాధ్యతతో పని చేయాలి