
సాగర్ కింద సాగుకు సన్నద్ధం
ఆయకట్టు కింద నారుమడి
నిజాంసాగర్: ఉమ్మడి జిల్లా వరప్రదాయని నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ ఆశాజనకంగా ఉంది. వానాకాలం పంటల సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు భరోసా ఏర్పడింది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభానికి ముందే ప్రాజెక్టులో 5 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉంది. దీంతో సుమారు నెల రోజులముందే పంటల సాగుకు ఆయకట్టు ప్రాంత రైతులు సన్నద్ధమవుతున్నారు. ప్రాజెక్టు కింద 2.5 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. అయితే అలీసాగర్ రిజర్వాయర్ వరకు 1.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రం నిజాంసాగర్ ప్రాజెక్టు నీరందుతుంది. మిగతా ఆయకట్టుకు గుత్ప, అర్గుల్ రాజారాం ఎత్తిపోతల ద్వారా సాగు నీరు అందనుంది. కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్, మహమ్మద్నగర్, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ 26 వరకు 33 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, మిగతా ఆయకట్టు నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉంది. మొదటి ఆయకట్టుతోపాటు డిస్ట్రిబ్యూటరీ 49 వరకు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ ఆశాజనకంగా ఉండటంతో బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, వర్ని, రుద్రూర్, కొటగిరి, ఎడపల్లి, నవీపేట మండలాల్లోని రైతులు నారుమళ్లను సిద్ధం చేసుకున్నారు. ఒక్క నిజాంసాగర్, మహమ్మద్నగర్ మండలాల రైతులు నారుమళ్లుకు ఆలస్యం చేస్తున్నారు. మొదటి ఆయకట్టు ప్రాంతం కావడంతోపాటు బోరుబావులు లేక ప్రధాన కాలువపైన ఆధారపడ్డారు. ప్రధాన కాలువకు నీటి విడుదల చేపట్టకపోవడంతో మొదటి ఆయకట్టు ప్రాంత రైతులు నారుమళ్లు వేయడం ఆలస్యమవుతోంది. ప్రాజెక్టు ఆయకట్టు కింద పంటల సాగుకు సన్నద్ధమైన రైతులను భూముల దుక్కితోపాటు నారుమళ్లకు వర్షాలు ఆదుకున్నాయి.
ఆశాజనకంగా
నిజాంసాగర్ నీటిమట్టం
పంటల సాగుకు భరోసా
లభించిందంటున్న రైతులు
1.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు
అందనున్న నీరు
స్వల్ప ఇన్ఫ్లో
నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 590 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1393.5 అడుగుల (5.9 టీఎంసీలు) నీరు నిల్వ ఉందన్నారు.

సాగర్ కింద సాగుకు సన్నద్ధం