పిఠాపురం: మిషన్ వాత్సల్య స్పాన్సర్షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా బాలల పరిరక్షణ అధికారి సీహెచ్ వెంకట్రావు సూచించారు. పిఠాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సీడీపీఓ మోక శ్రీకళ అధ్యక్షతన సోమవారం ఈ పథకం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మిషన్ వాత్సల్య స్పాన్సర్షిప్ పథకం ద్వారా అనాథలు, పాక్షిక అనాథలు, హెచ్ఐవీ, ఎయిడ్స్ ప్రభావిత కుటుంబాల పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న, కోవిడ్ ప్రభావిత కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తోందని తెలిపారు. పిఠాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 67 కుటుంబాలు లబ్ధి పొందుతున్నట్లు చెప్పారు. ఆయా కుటుంబ సభ్యుల నుంచి పిల్లల విద్యాభ్యాసం, ఆరోగ్య పరిస్థితులు, వైద్య సదుపాయాలు, కుటుంబ పరిస్థితులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పిఠాపురం ఐసీడీఎస్ సీడీపీఓ మోక శ్రీకళ మాట్లాడుతూ ఆ 67 కుటుంబాలకు ప్రతి నెలా రూ.4 వేల చొప్పున ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. ఈ సహాయాన్ని పిల్లల విద్య, ఆరోగ్యం, పోషకాహారం ఇతర అత్యవసరాలకు వినియోగించేలా సంరక్షకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి. దుర్గారాణి మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందుతున్న సహాయాన్ని లబ్ధిదారులు ఏ విధంగా వినియోగిస్తున్నారనే విషయంపై వారితో మాట్లాడి తెలుసుకున్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్లు ప్రభావతి, సత్యనారాయణమ్మ, సారమ్మ, దేవకుమారి, మానసాదేవి పాల్గొన్నారు.


