అన్నవరం: సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి శనివారం భక్తులు రూ.7,12,232 విరాళాలు సమర్పించారు. విజయవాడకు చెందిన దీప్తి తమ కుమారుడు పి.హరికృష్ణ పేరిట రూ.2 లక్షలు, భీమవరానికి చెందిన ఈదర నాగ వెంకట సుబ్బారావు రూ.2 లక్షలు, ఖమ్మం పట్టణానికి చెందిన బోడిల్ల నాగేశ్వరరావు రూ.1,11,116, అమలాపురానికి చెందిన ఆర్వీఎల్ఎన్ఎస్ పార్వతి రూ.లక్ష, హైదరాబాద్కు చెందిన యలమంచిలి నవీన్, నాగిని దంపతులు రూ.1,01,116 విరాళంగా సమర్పించారు. దాతలకు డిప్యూటీ కమిషనర్ బాబూరావు తదితరులు అన్నదానం బాండ్లు అందజేశారు.
కొనసాగిన వివాహిత ఆందోళన
కొత్తపల్లి: నాగలాపల్లి గ్రామానికి చెందిన చింతపల్లి మురళీరెడ్డి ఇంటి వద్ద అతడి భార్య రామశంకరి చేపట్టిన ఆందోళన రెండో రోజు శనివారం కొనసాగింది. తనకు పిల్లలు పుట్టిలేదని మురళీకృష్ణ వేరే మహిళను వివాహం చేసుకొని తనను మోసం చేశాడంటూ ఆమె కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇరువైపులా పెద్దలతో చర్చించారు. వారి మధ్య ఒప్పందం కుదరకపోవడంతో మంగ ళవారం మరోసారి మాట్లాడాలని పోలీసులు నిర్ణయించారు. తనకు న్యాయం జరగకపోవడంతో రామ శంకరి ఆందోళనను కొనసాగించింది.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
తాళ్లరేవు: మండల పరిధిలోని జి.వేమవరం గ్రామంలో విద్యుదాఘాతంతో చింతపల్లి వెంకట రమణ (60) మృతి చెందాడు. కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట రమణ తన మామిడి తోటలో విద్యుత్ మోటారు వేసే క్రమంలో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


