సుదర్శన పెరుమాళ్కు చక్రస్నానం చేయిస్తున్న రుత్విక్లు
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి దివ్య తిరు కల్యాణోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం వైనతేయ గోదావరి నదిలో శ్రీవారి చక్రస్నానం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రహ దోషాలు, అపమృత్యు దోషాలను నివారించే స్వామిగా ప్రాచుర్యం పొందిన సుదర్శన పెరుమాళ్తో పాటు గోవిందా...గోవింద అంటూ భక్తులు గోదావరిలో తలారా స్నానం చేసి పునీతమయ్యారు. దేవస్థానం ముఖ్య అర్చక గొడవర్తి శ్రీనివాసాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారి శిష్య బృందం ఆధ్వర్యంలో ఉభయ దేవేరులతో కొలువు దీరిన శ్రీవారిని ముందుగా పల్లకిలో ఊరేగిస్తూ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారితో పాటు సుదర్శన పెరుమాళ్కు నదీతీరంలో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం చక్రస్నానం జరిపించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.రాంబాబురెడ్డి, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మొల్లేటి చక్రపాణి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి.


