నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆర్యోగకరమైన శరీరం, ప్రశాంతమైన మనస్సు, సమతుల జీవన విధానాన్ని అందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కాకినాడలోని జిల్లా క్రీడా మైదానం ఇండోర్ హాలులో ఆదివారం జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆరోగ్య పరిరక్షణకు, జీవన నాణ్యతను మెరుగు పరచుకోవడానికి యోగా ఎంతో ఉపయోగిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల విజేతలు వేదుల శ్రీకృష్ణ, ఫణీంద్రలను ఆయన అభినందించారు. చిన్నారులు చైత్ర శివ వాసుకి, ఐ.ఎరిక్, కె.మిథున ప్రదర్శించిన నృత్య యోగా అందరినీ అలరించింది. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ వేటుకూరు ఏవీఎస్ సూర్యనారాయణరాజు, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జెడ్పీ సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు, పెద్దాపురం ఆర్డీఓ కృష్ణమూర్తి అతిథులుగా పాల్గొన్నారు. తొలుత పతంజలి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి వేడుకలు ప్రారంభించారు. యోగాచార్యులు రాఘవానంద, బ్రహ్మకుమారి దీదీలు ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ప్రజలతో యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన ప్రక్రియలు చేయించారు. కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఎంఎస్ అలీ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డీఎస్డీఓ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


