రత్నగిరి కిటకిట
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిటకిటలాడింది. సత్యదేవుని సన్నిధిలోను, వివిధ ప్రాంతాల్లోను శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు కూడా పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలి వచ్చారు. పార్కింగ్ స్థలాలన్నీ భక్తుల వాహనాలతో నిండిపోయాయి. ఘాట్ రోడ్డుకు ఇరువైపులా భక్తులు తమ వాహనాలను నిలిపివేయడంతో ట్రాఫిక్కు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. వ్రతాలు 2,400 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఆరు వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుని జన్మ నక్షత్రం మఖ సందర్భంగా తెల్లవారుజామున స్వామివారికి, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి, శంకరునికి పంచామృతాభిషేకం, ఉదయం 9 గంటలకు ఆయుష్య హోమం నిర్వహించారు.
న్యాయసేవలు
వినియోగించుకోండి
కాకినాడ లీగల్: ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలను రిమాండ్ ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, రాజమహేంద్రవరం సీనియర్ సివిల్ జడ్జి వై.శ్రీలక్ష్మి అన్నారు. కాకినాడలోని స్పెషల్ సబ్ జైలును శనివారం ఆమె సందర్శించారు. వంటశాల, మహిళా ఖైదీల బ్యారక్, ఫిర్యాదుల పెట్టె, రికార్డులను పరిశీలించారు. రిమాండ్ ఖైదీలతో మాట్లాడి, వారి ఆర్యోగ పరిస్థితి, వసతి, భోజనం ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఎన్ని రోజుల నుంచి జైలులో ఉన్నారో ఆరా తీశారు. వారికి అందుతున్న లీగల్ ఎయిడ్ సేవలపై అడిగి తెలుసుకున్నారు.


